నిమ్స్ లో క్యాష్ లేకపోతే కష్టమే!..ఓపీకి ఆన్​లైన్ ​పేమెంట్  సదుపాయం లేక రోగుల ఇబ్బందులు

నిమ్స్ లో క్యాష్ లేకపోతే కష్టమే!..ఓపీకి ఆన్​లైన్ ​పేమెంట్  సదుపాయం లేక రోగుల ఇబ్బందులు
  • అన్ని సేవల్లో ఆన్​లైన్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్
  • రోజూ సగటున 2,500  ఓపీలు

హైదరాబాద్, వెలుగు: పేదవారి కార్పొరేట్  హాస్పిటల్ గా పేరొందిన నిమ్స్ లో ఆ స్థాయి వైద్యసేవలు అందడం లేదు. ఓపీ రిజిస్ట్రేషన్  చేసుకునే సమయంలో ఆన్ లైన్  పేమెంట్  సదుపాయం లేకపోవడంతో.. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యసేవల కోసం నిమ్స్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ వేలమంది రోగులు వస్తుంటారు. ప్రస్తుతం బయట దాదాపు అన్నిచోట్ల ఆన్ లైన్  పేమెంట్స్  సదుపాయం ఉండడంతో క్యాష్  తీసుకుపోవడాన్ని చాలా వరకు తగ్గించారు.

అదే అలవాటులో నిమ్స్ కు వచ్చేవారు ఆన్ లైన్  పేమెంట్స్   సదుపాయం ఉంటుందనే నమ్మకంతోనే వస్తున్నారు. తీరా హాస్పిటల్ కు వచ్చి ఓపీ లైన్ లో నిల్చొని, కౌంటర్  దగ్గరకు వెళ్లగానే ‘ఆన్ లైన్  పేమెంట్  లేదు. ఓన్లీ క్యాష్’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. దీంతో రోగులు సమీపంలోని ఏటీఎంలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు సమీపంలో ఉన్న షాపుల్లో వందకు రూ.5, రూ. 10 అదనంగా ఆన్ లైన్ లో కమీషన్  చెల్లించి, క్యాష్ తీసుకుంటున్నారు. నిమ్స్  అధికారులు ఇకనైనా స్పందించి ఆన్ లైన్  పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకురావాలని కోరుున్నారు. 

కొన్ని రోజులుగా పనిచేయని మెషీన్లు 

ఓపీ రిజిస్ట్రేషన్ కు ఆన్ లైన్  సదుపాయం లేకపోయినా... రక్త, మూత్ర, ఈసీజీ, ఎక్స్ రే, 2డీఈకో తదితర పరీక్షలకు ఆన్ లైన్  సదుపాయం కల్పించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆన్ లైన్  పేమెంట్  మెషీన్లు కూడా కనిచేయకపోవడంతో.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిమ్స్ కు రోజూ సగటున  2500 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వీరిలో దాదాపు 50 నుంచి 60 శాతం మందికి వివిధ రకాల పరీక్షలు అవసరం పడతాయి. ఓపీ వంద రూపాయలే, కానీ ఈ ఇన్వెస్టిగేషన్స్ కు మాత్రం వేలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్  సదుపాయం లేకపోవడంతో  నిమ్స్ అధికారుల తీరుపై పేషెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వికారాబాద్  జిల్లాకు చెందిన జనార్దన్  రెడ్డి తన తండ్రిని తీసుకొని శనివారం ఆర్థోపెడిక్  ఓపీలో డాక్టర్ ను సంప్రదించాడు. డాక్టర్  కొన్ని  టెస్టులు రాయడంతో బిల్లు చెల్లింపుల కోసం కౌంటర్  వద్ద వెళ్లి డెబిట్  కార్డు, యూపీఐ పేమెంట్స్  కోసం అడిగారు. అక్కడున్న సిబ్బంది ప్రస్తుతం సర్వస్  బిజీగా ఉందని, పేమెంట్  కాకపోవచ్చని బదులిచ్చారు. డబ్బులు డెబిట్  అయితే తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో  చేసేది లేక..  బయట ఏటీఎంకు వెళ్లి, క్యాష్  విత్ డ్రా చేసుకొని వచ్చి చెల్లింపులు చేశారు.

ఈ విషయాన్ని సూపరింటెండెంట్  దృష్టికి తీసుకెళ్తే.. ఆర్ఎంఓని కలవాలని సమాధానం ఇచ్చారు. అప్పటికే అర్ధగంటకుపైగా, క్యూలైన్ లో నిల్చొని అలసిపోయిన జనార్దన్ రెడ్డి, మళ్లీ ఆర్ఎంఓ వద్దకు వెళ్లే ఓపిక లేక ఇంటికి వెళ్లిపోయాడు. ఈ తరహా అనుభవమే మంగళవారం మరో రోగికి కూడా ఎదురైంది. ఓపీ రిజిస్ట్రేషన్,  టెస్టుల చెల్లింపుల కోసం ఆన్ లైన్  పేమెంట్స్  సదుపాయం లేదని సిబ్బంది చెప్పడంతో బయట ఏటీఎంకు వెళ్లి క్యాష్  విత్ డ్రా చేసి చెల్లింపులు చేశారు.