దక్షిణ ఫిలిప్పీన్స్ లోని ప్రావిన్స్లో ఇవాళ(సోమవారం, ఆగస్టు-24) జంట పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంతో దాదాపు 9 మంది మృతి చెందగా, 17 మందికి పైగా గాయపడ్డారని సైనికాధికారులు తెలిపారు. సులు ప్రావిన్స్ రాజధాని జోలోలోని అత్యంత రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో కిరాణా షాపు ముందు నిలిపిన మిలటరీ ట్రక్ లక్ష్యంగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన మొదటి పేలుడులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గంట తర్వాత మొదటి పేలుడు ప్రదేశానికి 70 మీటర్ల దూరంలోని క్యాథలిక్ చర్చిలో రెండో పేలుడు జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు. రెండు చోట్ల గాయపడిన 17 మందిని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జంట పేలుళ్లతో అలర్టైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

