
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన మినిట్స్లో ఆ విషయం స్పష్టంగా ఉందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఒప్పుకుని, అలాంటిదేమీ లేదని మంత్రులు బుకాయిస్తున్నారని అన్నారు. వాళ్లు చెప్పే మాటలు నమ్మాలా.. మినిట్స్లో రికార్డు చేసిన అంశాలను నమ్మాలా అని ప్రశ్నించారు. 2015లోనే ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే నీటి వాటాలు తేల్చేవరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారన్నారు. అలాంటిది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే విషయంలో కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్ను విమర్శించడమే ఓ వింత అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరుతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహారాలోకి వెళ్తాయని, కనీసం నీటి వాటాలు తేల్చేదాకా అయినా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలన్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి వారికి బహుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రజలపై కరెంట్భారం పడే ప్రమాదముందన్నారు. సీఎం రేవంత్రెడ్డి అధికారిక పర్యటనల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.