లండన్ లో నీరవ్ మోడీ: సారీ.. నో కామెంట్స్

లండన్ లో నీరవ్ మోడీ: సారీ.. నో కామెంట్స్

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ….. లండన్ లో నివసిస్తున్నట్లు ప్రముఖ దిన పత్రిక ద డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది. లండన్ లోని విలాసవంతమైన ప్రాంతంలోని 8 పౌండ్ల మిలియన్ల విలువల ఖరీదైన అపార్ట్ మెంట్ లో నీరవ్ నివసిస్తున్నాడని తెలిపింది. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్ లో  పోస్ట్ చేసిన టెలిగ్రాఫ్… నీరవ్ మోడీ లండన్ లో మళ్లీ  వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపింది. భారత దేశంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ లండన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని టెలీగ్రాఫ్ పత్రిక తెలిపింది.

లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌ వీధిలో తిరుగుతూ క‌నిపించిన నీరవ్ ను గుర్తించిన టెలిగ్రాఫ్‌ రిపోర్ట‌ర్ నీర‌వ్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అత‌ను మాత్రం ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం ఇవ్వ‌లేదు. అంతేకాదు ‘నో.. కామెంట్‌’ అంటూ సమాధానమిచ్చాడు. తర్వాత ఆ రిపోర్టర్ తప్పించుకునేందుకు నీరవ్‌ ప్రయత్నించాడు. మొదట ఓ క్యాబ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. తర్వాత మరో క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను అత్యంత ఖరీదైన జాకెట్ వేసుకుని ఉన్నాడు.

లండన్‌లోని సెంటర్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్‌ ఉంటున్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్న సోహోలో నీరవ్‌ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది. మొత్తానికి ఇండియాలో ఆర్ధిక మోసాలకు పాల్పడిన విజయ్ మాల్యా రూట్లోనే నీరవ్ మోడీ కూడా లండన్ కు చేరుకున్నాడు.