నీరవ్‌ మోడీకి మరోసారి బెయిల్‌ తిరస్కరణ

నీరవ్‌ మోడీకి మరోసారి బెయిల్‌ తిరస్కరణ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీకి లండన్‌ కోర్టు మరోసారి బెయిల్‌ను తిరస్కరించింది. నేరస్తుల అప్పగింత కింద అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.ఈ పిటిషన్‌పై విచారణ వచ్చే ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని లండన్‌ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. 48 ఏళ్ల నీరవ్‌ మోడీ లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్‌ కోర్టుకు హాజరయ్యాడు. ఇంగ్లండ్‌లోని అత్యంత రద్దీగా ఉండే వాండ్స్‌వర్త్‌ జైలులో నీరవ్‌ రిమాండ్‌లో ఉన్నాడు. గడచిన మార్చి 19వ తేదీనుంచి ఆయన జైలులో ఉన్నాడు. ఈసారి నీరవ్‌ కు హుగో కీత్‌ క్యూసి అనే న్యాయసంస్థ మోడీ తరపున వాదిస్తోంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిన పరిస్థితులను మాత్రం బయటకు తెలపలేమని, విచారణ పూర్తయ్యేంత వరకూ రహస్యంగానే ఉంచుతామని యుకె క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ ప్రతినిధులు తెలిపారు. నీరవ్ కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వస్తున్న నీరవ్‌ అభ్యర్ధనలను లండన్‌ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ఎమ్మా అర్బథ్‌నాట్‌ తిరస్కరించారు.