నెట్వర్క్, వెలుగు: సర్పంచ్, వార్డు మెంబర్లకు మొదటి రోజే నామినేషన్ వేసేందుకు చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్పదవుల కోసం పోటీ చేసేందుకు నిర్మల్ జిల్లాలో మొదటి రోజు మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి.
దస్తురాబాద్ మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలకు గాను 6 నామినేషన్లు, కడెం పెద్దూర్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను 22, ఖానాపూర్ మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు గాను 16, పెంబి మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను 8, మామడ మండలంలోని 27 గ్రామపంచాయతీలకు 22, లక్ష్మణచాంద మండలంలోని 18 గ్రా మ పంచాయతీలకు గాను 15 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్లో 32 నామినేషన్లు
ఆదిలాబాద్జిల్లాలో సర్పంచ్ల పదవి కోసం మొదటి రోజు 32 నామినేషన్లు, 15 వార్డు మెంబర్లు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో ఆరు మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలకు, 1390 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 19 నామినేషన్లు దాఖలు కాగా సర్పంచ్ స్థానానికి 15, వార్డు సభ్యుల కోసం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానాలకు జైనూర్ మండలంలో 2, కెరమెరిలో 2, లింగాపూర్ లో 7, వాంకిడి మండలంలో నలుగురు నామినేషన్లు వేశారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో 13 నామినేషన్స్ దాఖలైనట్లు ఎంపీడీవో జేఆర్ ప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 6, వార్డ్ మెంబర్స్ స్థానాలకు 7 నామినేషన్స్ వచ్చాయని చెప్పారు.
