
- 71 ఏండ్ల డాక్టర్ ను చీట్ చేసిన చీటర్స్
బషీర్బాగ్,వెలుగు: సైబర్ నేరగాళ్లు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఏఐ వీడియోతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇదే తరహాలో ఓ మహిళా డాక్టర్ను స్కామర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం..
నగరానికి చెందిన 71 ఏండ్ల మహిళా డాక్టర్ఈ ఏడాది మార్చి 27న సోషల్ మీడియాలో ఆన్లైన్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్తున్నట్టు ఉన్న ఓ ఏఐ వీడియో చూసింది. ఆ వీడియో లింక్ పై క్లిక్ చేసి, పెట్టుబడికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది.
తర్వాత స్కామర్స్ బాధితురాలి వాట్సాప్ కు కాల్ చేసి ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు. మరికాసేపటికి ఫిన్ బ్రిడ్జ్ క్యాపిటల్ ప్రతినిధి అంటూ మరో స్కామర్ కాల్ చేశాడు. మొదట చిన్న మొత్తంలో రూ.20 వేలు పెట్టుబడి పెట్టాలని సూచించాడు.
స్కామర్ మాటలను నమ్మి ఆమె పెట్టుబడి పెట్టింది. దీనికి వారు ఫేక్ ట్రేడింగ్ యాప్ లో డాలర్ల రూపంలో అధిక మొత్తంలో లాభాలను చూపిస్తూ మళ్లీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. పలు దఫాలుగా రూ.20,13,305 పెట్టుబడి పెట్టింది. మళ్లీ స్కామర్లు బిట్ కాయిన్ బ్లాక్ లో 79,850 డాలర్లు లాభాలుగా వచ్చినట్టు చూపించి నమ్మించారు.
బాధితురాలు ఆ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా స్కామర్స్ ఇంకా పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి, ఆన్లైన్ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.