- 2024–25 కి గాను ఫిస్కల్ డెఫిసిట్ అంచనాలు తగ్గించిన ప్రభుత్వం
- జీడీపీలో 5.1 శాతం ఉంటుందని అంచనా
- జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడమే టార్గెట్
న్యూఢిల్లీ: ఓటర్లను ఆకర్షించడానికి ఇంటెరిమ్ బడ్జెట్లో పెద్దగా స్కీమ్లు ప్రకటించనప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ డెఫిసిట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఫిస్కల్ డెఫిసిట్ ( ప్రభుత్వ ఖర్చులు, రెవెన్యూ మధ్య తేడా. అప్పులు మినహాయించి) టార్గెట్ను వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 5.8 శాతంగా రికార్డవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
గతంలో వేసిన అంచనా జీడీపీలో 5.9 శాతం నుంచి తగ్గించారు. అంతేకాకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గుతుందని, జీడీపీలో 5.1 శాతానికి దిగొస్తుందని వెల్లడించారు. ‘2021–22 బడ్జెట్ స్పీచ్లో చెప్పినట్టు 2025–26 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ను జీడీపీలో 4.5 శాతం దిగువకు తీసుకురావడంపై పనిచేస్తున్నాం. ఇందులో భాగంగానే 2024–25 లో ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 5.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం’ అని తన బడ్జెట్ స్పీచ్లో నిర్మల అన్నారు. ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ గ్రోత్ 10.5 శాతంగా రికార్డవుతుందని అంచనా వేస్తోంది.
‘అనుకున్న దాని కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెంబర్లు ఎక్కువగా ఉండడం, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ను తగ్గించడం చూస్తుంటే 2023–24, 2024–25 లో ప్రభుత్వ ఖర్చులు జాగ్రత్తగా జరుగుతాయని తెలుస్తోంది’ అని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఓటర్లను ఆకర్షించే చాలా మాటలు బడ్జెట్లో ఉన్నప్పటికీ, అప్పులు తగ్గించడానికి, ఫిస్కల్ డెఫిసిట్ను కంట్రోల్లో ఉంచడానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చిందని నోమురా చీఫ్ ఎకనామిస్ట్ సోనల్ వర్మ పేర్కొన్నారు. గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ కంపెనీల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉందని, అందుకే ప్రభుత్వం క్యాపెక్స్ను పెంచిందని అన్నారు.
ఇక ప్రైవేట్ క్యాపెక్స్ పుంజుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం తన క్యాపెక్స్ను తగ్గించొచ్చని అంచనా వేశారు. కాగా, ట్యాక్స్ రెవెన్యూ పెరగడంతో ఫిస్కల్ డెఫిసిట్ దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 38.3 లక్షల కోట్ల గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని అంచనా. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 11.6 శాతం వృద్ధికి సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.34.37 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని గతంలో అంచనా వేశారు.
గత 10 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల విదేశీ ఇన్వెస్ట్మెంట్లు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, ఇందుకోసం వివిధ దేశాలతో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ (బిట్స్) ను కుదుర్చుకుంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. 2014–2023 మధ్య 596 బిలియన్ డాలర్ల (రూ.50 లక్షల కోట్ల) ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్డీఐ) వచ్చాయని, ఇది 2005–2014 మధ్య వచ్చిన ఎఫ్డీఐల కంటే డబుల్ అని వెల్లడించారు.
యూకే వంటి దేశాలతో ఇండియా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదగాలని చూస్తోందని, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విధానాలకు తగ్గట్టు తన విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ వెల్లడించింది. తనకు అనుకూలంగా లేకపోవడంతో 2016 నాటికి 80 బిట్స్లలో ఇండియా 77 రద్దు చేసిందని గుర్తు చేసింది.
ప్రస్తుతం 37 దేశాలతో మళ్లీ చర్చలు మొదలు పెట్టింది. కాగా, కిందటేడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య దేశంలోకి 20.48 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. జియో పొలిటికల్ టెన్షన్ల కారణంగా తగ్గాయి. సింగపూర్, మారిషస్, యూకే, యూఎస్, యూఏఈ దేశాలు ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి.