- క్యాపిటల్ వ్యయం అంచనా లక్షా 60 వేల కోట్లు
- గత బడ్జెట్తో పోలిస్తే10 వేల కోట్లు అధికం
- కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ రంగాల్లో పీపీపీలు
- మెట్రోరైలు నెట్వర్క్ విస్తరణకు ఎస్పీవీల ఏర్పాటు
- స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం
కొత్త లైన్ల నిర్మాణానికి 7,255 కోట్లు , గేజ్ మార్పిడికి 2,200 కోట్లు, లైన్ డబ్లింగ్ పనులకు 700 కోట్లు, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 50 లక్షల కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ : రైల్వేలకు గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులను 10 వేల కోట్ల రూపాయలను పెంచారు. అదే విధంగా క్యాపిటల్ వ్యయంకూడా 10 వేల కోట్ల రూపాయలమేర పెరుగుతుందని అంచనా వేశారు. పోయినేడాది 2018–19 వార్షిక బడ్జెట్లో రైల్వేలకు 55,088 కోట్ల రూపాయలు కేటాయించగా, ఈసారి 65,837 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కి తెలిపారు. క్యాపిటల్ వ్యయం గతేడాది 1,48 లక్షల కోట్ల రూపాయలుండగా, ఈసారి 1,58,658 కోట్లకు చేరుతుందని తెలిపారు. ఈ మొత్తంలో కొత్త లైన్ల నిర్మాణానికి 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి 2,200 కోట్లు, లైన్ డబ్లింగ్ పనులకు 700 కోట్లు, రోలింగ్ స్టాక్కి 6,114.82 కోట్లు, సిగ్నలింగ్ అండ్ టెలికాం వ్యవస్థకు 1,750 కోట్లు కేలాయించారు. మిగిలిన విభాగాలకు ఈ ఏడాది ఇంటీరిమ్ బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చేసిన కేటాయింపులు యధాతథంగా ఉంటాయని తెలిపారు.
రైల్వేల అభివృద్ధికోసం వచ్చే 12 ఏళ్లలో 50 లక్షల కోట్ల రూపాయల సమీకరించాలని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని 2018–30 మధ్య కాలంలో సమకూర్చుకోవలసి ఉంటుంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా రైల్వేల లభివృద్ధి, కనెక్టివిటీని పెంచడంద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు, వేగవంతమైన రవాణా వంటి ప్రాజెక్టులను చేపడతారు. సబర్బన్ రైల్వేలలో పెట్టుబడుల ప్రోత్సాహానికి, మెట్రో రైలు నెట్వర్క్ విస్తరణను పీపీపీలద్వారా చేపట్టడానికి వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు, రైల్వేలపై ఒత్తిడి తగ్గించడానికిగాను నదీ మార్గాలద్వారా కార్గో రవాణా పెంచనున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఏడాది రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుడతామన్నారు. ఇంటీరిమ్ బడ్జెట్లో రైల్వేలకు 64,587 కోట్ల రూపాయల క్యాపిటల్ మద్దతుని ప్రకటించారు. మొత్తంగా రైల్వేల క్యాపిటల్ వ్యయం 1,58,658 కోట్ల రూపాయలకు చేరనుంది.
ప్రయాణికులకు సౌకర్యాల మెరుగుదలపై దృష్టి సారిస్తామని చెబుతూ, వీటికోసం 3,422.57 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ఇంతకుముందు జరిపిన కేటాయింపులకంటే వెయ్యి కోట్లు అదనం కావడం గమనార్హం. రైల్వే సిబ్బంది జీతభత్యాలకింద 86,554.31 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, పోయినేడాదితో పోలిస్తే 14 వేల కోట్లు అదనపు భారం పడుతుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. రైల్వేల్లో ప్రయాణీకుల భద్రతకుగాను వీడియో సర్వైవలెన్స్ సిస్టమ్కోసం నిర్భయ ఫండ్కి 267.64 కోట్లను కేటాయించారు. కొంకణ్ రైల్వే కార్పొరేషన్కి 17.64 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ ఏడాది రైల్వేల ఆదాయం 2,16,675 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.