
టమాటా రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.. పెరిగిన రేట్లతో సామాన్య ప్రజలు కొందరు టమాట తినడమే మానేశారు. ఇదే విషయంపై పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. టమాట రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.
ఉత్తరాదిన పంట నష్టం వల్ల టమాట రేట్లు పెరిగాయని..త్వరలోనే టమాట రేటు తగ్గుతుందన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని టమోటా పండించే ప్రాంతాల నుండి టమోటాలను సేకరించి.. ఎన్సిసిఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ,రాజస్థాన్ లో ఈ ప్రక్రియ జూలై 14 నుంచే ప్రారంభించామని..ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే ఢిల్లీలో, మొబైల్ వ్యాన్లు NCCF, NAFED, కేంద్రీయ భండార్ ద్వారా టమాటను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ఈ రోజు వరకు NCCF రాజస్థాన్, ఢిల్లీ-NCR , ఉత్తరప్రదేశ్లలో 8,84,612 కిలోల టమోటాలను పంపిణీ చేసిందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలోని హోల్సేల్ మండీలు కేజీ టమాట రూ. 100 లోపు అమ్ముతున్నాయని చెప్పారు. ఈ రోజు నుంచి తాము కోలార్ మండి ద్వారా టొమాటోలను బుక్ చేసి ఢిల్లీకి రూ. 85 కేజీ చొప్పున ఇస్తామని తెలిపారు. నేపాల్ నుంచి టమాలు దిగుమతికి పరిమితులు తొలగించామని రెండు మూడు రోజుల్లో టమాట నిల్వలు వారణాసికి చేరుకుంటాయన్నారు.