సెంచరీతో చెలరేగిన నిశాంక.. రెండో టెస్ట్‎లో ధీటుగా ఆడుతోన్న శ్రీలంక

సెంచరీతో చెలరేగిన నిశాంక.. రెండో టెస్ట్‎లో ధీటుగా ఆడుతోన్న శ్రీలంక

కొలంబో: బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో శ్రీలంక దీటుగా ఆడుతోంది. ఓపెనర్‌‌ పాథుమ్‌‌ నిశాంక (146 బ్యాటింగ్‌‌) సెంచరీతో చెలరేగడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌కు లంక తొలి ఇన్నింగ్స్‌‌లో 78 ఓవర్లలో 290/2 స్కోరు చేసింది. నిశాంకతో పాటు ప్రభాత్‌‌ జయసూరియ (5 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. లాహిరు ఉడార (40)తో తొలి వికెట్‌‌కు 88 రన్స్‌‌ జత చేసిన నిశాంక, దినేశ్‌‌ చండిమల్‌‌ (90)తో రెండో వికెట్‌‌కు 194 రన్స్‌‌ జోడించాడు. 

తైజుల్‌‌ ఇస్లామ్‌‌, నయీమ్‌‌ హసన్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. అంతకుముందు 220/8 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 79.3 ఓవర్లలో 247 రన్స్‌‌కు ఆలౌటైంది. తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (33) మోస్తరుగా ఆడాడు. ఆషితా ఫెర్నాండో, సోనల్‌‌ దినుషా చెరో మూడు వికెట్లు తీశారు. ప్రస్తుతం లంక 43 రన్స్‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.