హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అది కేవలం రాజకీయాలకే పరిమితమైందన్నారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై నబీన్ నోరు విప్పితే బాగుండేదని అన్నారు.
కనీసం రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులైనా నబీన్పై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో మాట్లాడిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెప్పుకుంటున్నదని.. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వంద సీట్లలో డిపాజిట్ కూడా రాలేదన్న విషయం బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు.
