కేంద్రంలో బీజేపీని గద్దె దించాడానికి దేశంలోని అన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. పాట్నాలో ఆదివారం జరిగిన సీపీఎం 11వ మహాసభలో నితీష్ కుమార్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిచేందుకు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ చేతులు కలపాలన్నారు. యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడితే బీజేపీని 100 స్థానాలకే పరిమితం చేయొచ్చని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని నితీష్ కోరారు. కాదు కూడదు అంటే.. ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దేశ ప్రజలందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం, విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తన ఏకైక ఆశయమని చెప్పారు. ఇక ప్రధాని కావాలని తనకు ఆశ లేదని నితీష్ మరోసారి స్పష్టం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.