
బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ద్రోహం చేసే అలవాటున్న నితీష్ తో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ పై నితీష్ ఈ విధంగా స్పందించారు. తమతో కలిసి బీజేపీనే లాభపడిందన్న నితీష్ ... వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ బీజేపీ ప్రయోజనం పొందిందని చెప్పారు.
తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్లపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నితీష్ కుమార్ అన్నారు. 2017లో ఎన్డీఏలోకి వచ్చి తప్పుపని చేశామని.. మరోసారి ఆ తప్పు చేయబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో 40 లోక్సభ స్థానాలకు గాను 36 స్థానాలు గెలుస్తామని బీజేపీ ప్రకటించడాన్ని నితీష్ కుమార్ విమర్శించారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.