బషీర్ బాగ్, వెలుగు: హాస్టల్లో మెస్ ఓపెన్ చేయాలంటూ నిజాం కాలేజీ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. బషీర్బాగ్లోని హాస్టల్ ముందు రోడ్డుపై గిన్నెలు పెట్టుకొని బైఠాయించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాస్టల్కు వచ్చిన తమకు గత 10 రోజులుగా మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ బంద్ ఉందని చెబుతూ మొదట మెస్ ఓపెన్ చేయలేదని, తర్వాత మెస్ ఫీజు కడితే ఓపెన్ చేస్తామని హాస్టల్ వార్డెన్ చెప్పారని తెలిపారు.
మూడ్రోజుల క్రితం రూ.8,200 చొప్పున 80 మంది స్టూడెంట్లు అందరం ఫీజు కట్టామని, అయినా మెస్ ఓపెన్ చేయడం లేదని మండిపడ్డారు. రోజు బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటున్నా.. కనీసం తాగడానికి వాటర్ కూడా పెట్టడం లేదన్నారు. స్టూడెంట్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకుడు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మద్దతు తెలిపారు. స్టూడెంట్ల ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు హాస్టల్ వార్డెన్తో మాట్లాడి మెస్ ఓపెన్ చేయిస్తామని సర్ది చెప్పడంతో స్టూడెంట్లు ఆందోళనను విరమించారు.