ఆర్మూర్ చోరీ కేసులో అన్న కొడుకే దొంగ..హైదరాబాద్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్

ఆర్మూర్ చోరీ కేసులో అన్న కొడుకే దొంగ..హైదరాబాద్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్
  • ఆర్మూర్ ​చోరీ కేసును  ఛేదించిన పోలీసులు
  •     580 గ్రాముల గోల్డ్, రూ.19.33 లక్షల క్యాష్​ రికవరీ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో వ్యాపారి రాజ్​కుమార్​అగర్వాల్​ఇంట్లో మే 24న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రాజ్​కుమార్​ సొంత అన్న కొడుకు రౌడీషీటర్​అయిన విజయ్​అగర్వాల్​సారథ్యంలోనే చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ సాయిచైతన్య తెలిపారు. వివరాలను నిజామాబాద్​లోని పోలీస్​కమాండ్​ కంట్రోల్ రూమ్​లో సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఆర్మూర్​మహాలక్ష్మి కాలనీకి చెందిన రాజ్​కుమార్​అగర్వాల్​గతంలో బంగారం బిజినెస్ చేసి ప్రస్తుతం బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. పలు నేరాలు చేసిన రాజ్​కుమార్ అన్న కొడుకు విజయ్​ అగర్వాల్​పై పోలీసులు ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్​ చేశారు. బాబాయ్​ ఇంట్లో నగదు, బంగారం ఉందని తెలిసిన విజయ్​వాటిని కాజేసేందుకు దొంగతనం ప్లాన్​వేశాడు. 

బాబాయ్ ​ఇంటి తాళంచెవిని డుప్లికేట్ ​చేయించాడు. మే 24న రాజ్​కుమార్​తన కుటుంబంతో కలిసి వేములవాడ దైవదర్శనానికి వెళుతున్నట్లు తెలుసుకొని చోరీ కోసం హైదరాబాద్ నందినగర్​లో ఉండే సల్మాన్ ఖాన్​ను సంప్రదించాడు. సల్మాన్​ఖాన్, మంజల్ ​సాయికుమార్, శ్రీహరి ఆర్మూర్​కు చేరుకొని 24న రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 580 గ్రాముల బంగారం, 10 గ్రాముల చైన్, 350 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.22.93 లక్షల నగదులో ఉడాయించారు.

 ఘటనపై బాధిత కుటుంబం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బ్రహ్మణపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్​తో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

దొంగతనం చేసిన బంగారం, వెండిని మొత్తం రికవరీ చేసుకోగా.. రూ.22.93 లక్షల నగదులో రూ.19.33 లక్షల సొమ్మును వారి నుంచి స్వాధీనం చేసుకున్నరు. విజయ్​తోపాటు సల్మాన్​ఖాన్, సాయికుమార్​ను అరెస్ట్​ చేశామని, శ్రీహరి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.