- ఒత్తిళ్లు, ఒప్పందాలు, సీక్రెట్ మీటింగ్లు
- ఉత్కంఠగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ విత్డ్రా రాజకీయాలు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని బోధన్ డివిజన్లో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా ముగిసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విత్డ్రా గడువు పూర్తికాగానే, బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వారి ఎన్నికల గుర్తులతో రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. ఈ దశలో రాజకీయ మార్పులు, ఒత్తిళ్లు, చర్చలు, ఒప్పందాలు జరిగాయి.
ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సర్వప్రయత్నం చేశారు. సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేసి సీక్రెట్ లొకేషన్లలో సమావేశాలు జరిపారు. మరికొందరిని విత్డ్రా చేయించేందుకు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. తొలి దశ విత్డ్రా డ్రామా ఆసక్తికరంగా ముగిసింది.
కుర్చీ మాత్రమే నాది..అధికారం మీదే !
బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో మొత్తం 184 గ్రామ పంచాయతీలు, 1,642 వార్డుల్లో తొలి విడత ఎన్నికలకు నవంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ పోస్టులకు 1,156, వార్డు సభ్యులకు 3,526 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీ, అప్పీల్స్ ప్రక్రియ పూర్తయ్యాక, నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది. విత్డ్రా గడువు సమీపించడంతో ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.
రెంజల్ మండలంలో ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రత్యర్థి ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని వేడుకున్న ఘటన కలకలం రేపింది. గెలిచాక కుర్చీపై నేను కూర్చుంటా, కానీ అధికారం, పవర్లు అన్నీ నీవే నడిపించు అంటూ బ్రతిమిలాడినా ప్రత్యర్థి వెనక్కి తగ్గలేదు.
ఒక గ్రామంలో ఇద్దరు అభ్యర్థులను తప్పించేందుకు ఓ క్యాండిడేట్ రూ.4 లక్షలు చెల్లించినట్టు సమాచారం. మరో గ్రామంలో విత్డ్రా కోసం రూ.7 లక్షలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది.
నవీపేట మండలంలో నామినేషన్ వేసిన రోజు నుంచి విత్డ్రా చేయమని ఒత్తిడి తెస్తుండడంతో విసిగిపోయిన ఓ అభ్యర్థి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు కనిపించకుండా పోయాడు. సెల్ఫోన్ స్విచ్ఆఫ్ చేసి తన మద్దతుదారులతో కలిసి పొలం వద్ద ‘దావత్’లో కూర్చుని దాక్కున్నాడు. రిటర్నింగ్ అధికారులు తుది పోటీదారుల జాబితా ప్రకటించిన తరువాతే బయటకు వచ్చాడు. ప్రతిపక్షాలు మధ్యాహ్నం వరకు అతడిని గాలించినా దొరకలేదు.
కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న గొడవల కేసులపై గంటలకొద్దీ చర్చల అనంతరం 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, ఐదుగురు మాత్రమే బరిలో మిగిలారు.
పోతంగల్ మండలంలోని ఓ గ్రామంలో, గతంలో మండల పోస్టును నిర్వహించిన ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి భారీ బేరసారాలు జరిపి విత్డ్రా ప్రక్రియలో సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
ఎడపల్లి మండలం జాన్కంపేట పంచాయతీలో ఒకరిని కూడా విత్డ్రా చేయించలేకపోవడంతో సర్పంచ్ స్థానం కోసం ఎనిమిది మంది పోటీలో నిలిచారు. అదే తరహాలో రుద్రూర్ మండలం అంబం, మోస్రా గ్రామాల్లో కూడా ఎనిమిది మంది చొప్పున పోటీలో ఉన్నారు.
చిన్మమ్మ మృతి తెచ్చిన తంటా..
బోధన్ మండలంలోని ఓ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడానికి కొన్నాళ్ల నుంచి ప్లాన్ వేసి ఓ వ్యక్తి నామినేషన్ వేశాడు. సరిగ్గా బుధవారం అతడి చిన్మమ్మ చనిపోయింది. అంటుముట్ల సెంటిమెంట్తో ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యంకాదని నామినేషన్ విత్డ్రా చేసుకున్నాకే అంత్యక్రియలు చేశాడు. ఫైనల్గా మేనమామ, అల్లుడు అక్కడ పోటీ చేస్తున్నారు.
