
నిజామాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులను ఇతర పనులకు మళ్లించొద్దని, నిర్దేశిత పనులకే వినియోగించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన దిశ మీటింగ్లో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఎంపీ భూముల్లో పూర్తైన నిర్మాణాలకు బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. నగరంలోని అమృత్, అండర్గ్రౌండ్ డ్రేనేజీ పనులను దసరా తరువాత సమీక్షిస్తానని, పూర్తి వివరాలు అందించాలని అధికారులను కోరారు. పీఎం విశ్వకర్మ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులను పెంచి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని సూచించారు. పీఎంశ్రీ కింద మంజూరైన 8 స్కూల్స్లో వసతులను సమీక్షించారు.
నగరంలోని తిలక్ గార్డెన్ కమర్షియల్ కాంప్లెక్స్ మడిగెల్లో బినామీలు వ్యాపారాలు చేస్తున్నాయని, మల్లారం, బాబన్పహాడ్, సారంగాపూర్ హనుమాన్ మందిరం ఏరియాలో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. సమగ్ర విచారణ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్వో వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, దిశ సభ్యులు హన్మంత్ రావు, ఆశన్న, లింగం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.