
- లోపాలను ఎత్తి చూపుతూ లేఖ
- అప్పీల్కు మరో అవకాశం
- రీఇన్ స్పెక్షన్ చేసి నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవసరమైన ఫ్యాకల్టీని నియమించి, లోపాలను సవరిస్తేనే పర్మిషన్లు ఇస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసిన 8 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు వేర్వేరుగా మెయిల్ పంపింది. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేరని, స్టూడెంట్లు, పేషెంట్లకు అవసరమైన సదుపాయాలు లేవని పేర్కొంది. ఫ్యాకల్టీని భర్తీచేసి, లోపాలను సవరించేందుకు గడువు ఇచ్చింది. అవన్నీ చేశాక మళ్లీ అప్పీల్ చేసుకోవాలని, రీఇన్స్పెక్షన్ చేసి పర్మిషన్లపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిచేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇస్తూ వారికి కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సవరిస్తామని తెలిపారు.
జోగుళాంబ గద్వాల, ములుగు, మెదక్, మహేశ్వరం (రంగారెడ్డి), నర్సంపేట్(వరంగల్), కుత్బుల్లాపూర్(మేడ్చల్), యాదాద్రి భువనగిరి, నారాయణపేట్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పర్మిషన్ కోరుతూ నిరుడు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. ఇటీవలే ఆయా కాలేజీల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు చేశాయి. ఆగస్టులో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉన్నందున, ఈ లోపల అప్పీల్కు ఎన్ఎంసీ అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ కాలేజీలతో పాటు మూడు ప్రైవేటు కాలేజీలు కూడా పర్మిషన్ కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాయి. ఇందులో నిజామాబాద్ నుంచి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, అబ్దుల్లాపూర్మెట్లోని నోవా ఇన్స్టిట్యూట్, పటాన్చెరు నుంచి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఈ 11 కాలేజీలకు పర్మిషన్ వస్తే, రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య దాదాపు 10 వేలకు చేరువ అవుతుంది. ఇప్పుడు 56 కాలేజీల్లో 8,515 సీట్లు ఉన్నాయి.