
- నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట
- ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకూ నిరుటి ఫీజులే
హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ కోర్సులతో పాటు మిగిలిన ప్రొఫెషనల్ కోర్సులన్నింటికీ ఈ సారి పాత ఫీజులే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఈ ఏడాది ఫీజుల భారం నుంచి స్టూడెంట్లు, పేరెంట్స్ కు ఊరట లభించినట్టు అయింది. రాష్ట్రంలో 1,250కి పైగా ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. వీటిలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ తదితర 12 కోర్సులకు ప్రతి మూడేండ్లకో సారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫీజులు నిర్ణయిస్తున్నది. అయితే, 2022–23లో నిర్ణయించిన ఫీజులు.. గత విద్యాసంవత్సరం 2024–25తో ముగిసింది.
దీంతో 2025–26, 2026–27, 2027–28 విద్యాసంవత్సరాలకు కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆయా కాలేజీల మేనేజ్మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ సమావేశాలు నిర్వహించి, ఫీజుల ప్రతిపాదనలు రెడీ చేసింది. బీటెక్, ఎంటెక్ తదితర కోర్సులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 వరకు, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, ఇతర ఫార్మా కోర్సులకు మార్చి 12 నుంచి 18 వరకు, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు మార్చి 23, బీపీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేనేజ్మెంట్లతో హియరింగ్ ఏర్పాటు చేశారు. వీటిలో కాలేజీలు ఇచ్చిన లెక్కలకు అనుగుణంగా ఫీజుల ప్రతిపాదనలను ఓకే చేశారు.
బీటెక్, బీఈడీ కోర్సులకే ఎక్కువ ఫీజులు
రాష్ట్రంలో ప్రధానంగా 12 ప్రొఫెషనల్ కోర్సులుండగా, వాటిలో బీటెక్ తో పాటు, బీఈడీ కోర్సులకే ఎక్కువగా ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు రెడీ చేసినట్టు తెలిసింది. అయితే, బీటెక్ లో టీఏఎఫ్ఆర్సీ భారీగా ఫీజులు పెంపు ప్రతిపాదనలు ఇవ్వడంతో.. ప్రభుత్వం వీటిపై మరోసారి రివ్యూ చేయాలని డిసైడ్ అయింది. రెండోసారి సమావేశంలోనూ ఇదే తీరులో ఫీజులు ఉండటంతో, ఈ సారి ఫీజుల పెంపును ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. టీఏఎఫ్ఆర్సీ ఇచ్చిన ప్రతిపాదలను మరోసారి సమీక్షించేందుకు ఆఫీసర్స్ కమిటీ వేయాలని విద్యాశాఖ డిసైడ్ అయింది.
అయితే, మిగిలిన కోర్సులన్నింటిలో కాస్త బీఈడీలో ఎక్కువగా ఫీజులు పెంచినట్టు తెలిసింది. మిగిలిన ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఇతర కోర్సుల్లో 10 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచినట్టు సమాచారం. అయితే, కొన్ని కాలేజీల్లో భారీగా పెంచి, కొన్నింటిలో నామమాత్రంగా పెంచడాన్ని సర్కారు తప్పుబట్టింది. దీంతో బీటెక్ సహా మిగిలిన కోర్సుల విషయంలోనూ పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే, 2025–26 విద్యాసంవత్సరానికి మాత్రమే పాత ఫీజులు ఉంటాయా.. లేక 2025–27 బ్లాక్ పీరియెడ్కు పాత ఫీజులను కొనసాగిస్తారా.. అనే దానిపై స్పష్టత కరువైంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఇచ్చే ఫీజుల జీవోతో క్లారిటీ రానున్నదని అధికారులు చెప్తున్నారు.
ప్రొఫెషనల్ స్టూడెంట్లకు ఆర్థికంగా ఊరట
ఫీజుల పెంపు లేకుండా పాత ఫీజులనే కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. ప్రొఫెషనల్ విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో ఊరట కలిగించనున్నది. ఇప్పటికే ఇంజనీరింగ్లో లక్షల్లో ఫీజులు ఉండగా, ఇతర కోర్సుల్లో వేలాది రూపాయల ఫీజు ఉంది. ఈ సారి పెంచితే కనీసం 20 శాతానికి పైగా ఫీజులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం పేద విద్యార్థులపై తీవ్రంగా పడనున్నది. అయితే, సర్కారు తీసుకున్న నిర్ణయంతో వారికి ఊరట లభించినట్టు అయింది.