
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేస్తారని ఆయన వెల్లడించారు. రాయపూర్లో జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ జరిగింది. స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్యవర్గానికి ఎన్నిక వద్దని, నామినేషన్ వేయాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగా జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ తెలిపారు.
కాగా ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరుకాలేదు. మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చేందుకే వారంతా సమావేశానికి దూరంగా ఉన్నారని, మిగతా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సీనియర్ నేతలు చెప్పారు. ఇదిలా ఉండగా రాయపూర్ లో ప్రారంభమైన ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.