- పబ్లిక్కు 4 వేల టికెట్లు.. మొత్తం 14 వేల మందికే ఇన్విటేషన్లు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్నందున రిపబ్లిక్ డే వేడుకలకు పిల్లలను అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న పెద్దలకే పరేడ్కు వచ్చేందుకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా కారణంగా ప్రజలకు 4 వేల టికెట్లు మాత్రమే ఇస్తున్నామని, మొత్తం 14 వేల మందిని ఇన్వైట్ చేస్తున్నామని ప్రకటించారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్ర బోస్ జయంతి(జనవరి 23)ని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోనున్నందున, రిపబ్లిక్ డే వేడుకలను కూడా అదే రోజు స్టార్ట్ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
నిఘా నీడలో ఢిల్లీ
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో టెర్రరిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెజెలిజెన్స్ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)ను ‘వెరీ హై సెక్యూరిటీ’ జోన్గా ప్రకటించారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకూ యూఏవీలు, పారాగ్లైడర్స్, హాట్ ఎయిర్ బెలూన్ల వంటి అన్ని రకాల ఏరియల్ వెహికల్స్పై పోలీసులు బ్యాన్ పెట్టారు. పారామిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీస్, స్పెషల్ సెల్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, స్వాట్, ఎన్ఎస్ జీ విభాగాల బలగాలను మోహరిస్తున్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ గన్ను కూడా సిద్ధంగా ఉంచామని ఢిల్లీ సీపీ రాకేశ్ ఆస్తానా చెప్పారు.