తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవ్: కేసీఆర్​

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవ్: కేసీఆర్​
  • బంజారాహిల్స్‌‌లో అమీరుకు ఇస్తున్న నీళ్లే..బంజారా తండాలో గరీబుకు ఇస్తున్నం: కేసీఆర్
  • ఒకప్పుడు సాగు, తాగునీరు, కరెంట్‌‌ కోసం పరితపించినం
  • ఇప్పుడు 24 గంటల కరెంట్‌‌,ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నం
  • ధనం లేక కాదు.. పాలకులు మనసు పెట్టకనే సమస్యలని కామెంట్
  • బీఆర్‌‌ఎస్‌‌లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌‌ గమాంగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బిల్కుల్ లేవని సీఎం కేసీఆర్‌‌ అన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా నుంచి 50 శాతం మంది వలసలు పోయేవాళ్లని, తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వారంతా వాపస్‌‌ వచ్చారని చెప్పారు. ‘‘దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో ఉన్నాయి. వాటి గురించి చదువుతుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు మహారాష్ట్రలో డబ్బు లేదా? తెలంగాణ కన్నా మహారాష్ట్ర ఏమైనా చిన్నదా? మేం ఎంతో ప్రయాస పడి, రైతులకు వెన్నంటి నిలిచి.. వాళ్లకు కొన్ని ప్రయోజనాలు ఇచ్చి ఇక్కడ ఆత్మహత్యలు లేకుండా చేశాం. తెలంగాణ రైతులు తలెత్తుకొని బతుకుతున్నారు.. తెలంగాణలో సాధ్యమైనది మహారాష్ట్రలో ఎందుకు కాదు.. ఒడిశాలో ఎందుకు కాదు.. ఇది ధనంతో కూడిన సమస్య కాదు.. మనస్సుతో ఆలోచించకపోవడంతోనే సమస్య’’ అని అన్నారు. 

ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌‌ గమాంగ్‌‌ సహా ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో అనేక సమస్యలు ఉండే.. కరెంట్‌‌, సాగు, తాగునీటికి ఇక్కట్లు పడ్డాం. ఇప్పుడు 24 గంటల కరెంట్‌‌, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నాం. బంజారాహిల్స్‌‌లో అమీరుకు.. బంజారా తండాలోని గరీబుకు ఒకే రకమైన శుద్ధి చేసిన నీళ్లను నల్లాల ద్వారా అందిస్తున్నాం’’ అని చెప్పారు. 

నష్టాలు ప్రజలకు.. సంపద ప్రైవేటుకు..

‘‘ఈ దేశానికి అసలు లక్ష్యం ఉందా అని ఖమ్మం సభలో నేను ప్రశ్నించిన. ఎన్నికల్లో ఏం చేసైనా గెలవడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉన్నది. ఇందుకోసం ప్రజల మధ్య విభజన తీసుకువస్తున్నరు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ పార్టీలు ఉండాలే తప్ప విడదీయడానికి కాదు” అని సీఎం కేసీఆర్ అన్నారు. మహానది, బ్రాహ్మణి, వైతరణి నదుల్లో ఉన్న నీళ్లు వినియోగించుకుంటే ఒడిశాలో సాగు, తాగునీటికి ఇబ్బందులే ఉండవని చెప్పారు. దేశంలో యువతకు ఉద్యోగాలు దక్కడం లేదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదని, రైతులు 13 నెలలు దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలు చేశారని.. ఇది సిగ్గుపడే విషయం కాదా అని ప్రశ్నించారు. రైతులు నాగలి పట్టడమే కాదు కలం పట్టాలని.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవాలని అన్నారు. అందుకే అబ్‌‌ కీ బార్‌‌ కిసాన్‌‌ సర్కార్‌‌ అని బీఆర్‌‌ఎస్‌‌ నినాదం ఎత్తుకున్నదని తెలిపారు. 

దళితబంధు విజయాలను చూపుతం

తనకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. తాము దేశం ముందు పెడుతున్న విధానాలపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. ‘‘దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడానికి బలమైన పొలిటికల్ కమిట్ మెంట్ ఉండాలి. అది మా దగ్గర ఉంది. తెలంగాణలో వ్యవసాయం బాగుపడింది. రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్నది” అని అన్నారు. బీఆర్ఎస్‌‌కు అధికారం ఇస్తే రెండేండ్లలో దేశమంతటా 24 గంటల కరెంట్‌‌ ఇస్తామని, వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ ఇస్తామని తెలిపారు. దేశంలోని రైతులకు కిసాన్ బంధు, ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో దళితబంధు సాధించిన విజయాలను ఒడిశా నుంచి వచ్చిన వారికి చూపిస్తామన్నారు. దేశంలో సాగు యోగ్యమైన 83 కోట్ల ఎకరాల భూమికి సాధ్యమైనంత త్వరగా సాగునీటిని అందిస్తామన్నారు.

వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది..

గిరిధర్‌‌ గమాంగ్‌‌ మచ్చలేని నాయకుడని.. ఆయన పార్టీలో చేరడం.. ఆయన వెంట ఇంత మంది రావడం తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని కేసీఆర్ అన్నారు. ఒడిశాలో రూ.500 పింఛన్‌‌ మాత్రమే ఇస్తున్నారని, ఇక్కడ రూ.2 వేలు ఇస్తున్నారని చెప్పాలని అన్నారు. దేశ భవిష్యత్‌‌ను మార్చేందుకు.. బీఆర్‌‌ఎస్‌‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ మహాయుద్ధంలో ఇంతమంది భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. గమాంగ్‌‌ వెంట ఆయన సతీమణి, మాజీ ఎంపీ హేమ గమాంగ్‌‌, ఆయన కుమారుడు శిశిర్‌‌ గమాంగ్‌‌, మాజీ మంత్రి జయరామ్‌‌ పంగి తదితరులు బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు.

ఒడిశా బీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్షుడెవరు?

బీఆర్‌‌ఎస్‌‌లో ఏపీ నేతలు చేరిన రోజే తోట చంద్రశేఖర్‌‌ను ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్‌‌ ప్రకటించారు. ఒడిశా నేతల చేరిక సందర్భంలోనే ఆ రాష్ట్ర బీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్షుడిని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. వయోభారం వల్ల గిరిధర్‌‌ గమాంగ్‌‌కు బదులు ఆయన కుమారుడు శిశిర్‌‌ గమాంగ్‌‌కు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు సాగాయి. కానీ అలా ప్రకటించలేదు. బీఆర్‌‌ఎస్‌‌లో చేరడానికి వచ్చిన ఒడిశా నాయకులు ఇంకో రెండు మూడు రోజులు హైదరాబాద్‌‌లోనే ఉంటారని, శనివారం ప్రగతి భవన్‌‌లో వారితో కేసీఆర్‌‌ మరోసారి సమావేశమవుతారని తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్ ఒడిశా శాఖ అధ్యక్షుడిని ప్రకటించవచ్చని చర్చ సాగుతోంది.

రేపు బీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ప్రగతి భవన్‌‌లో కేసీఆర్‌‌ అధ్యక్షతన నిర్వహించనున్నారు. పార్లమెంట్‌‌ బడ్జెట్‌‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్‌‌ దిశానిర్దేశం చేయనున్నారు. విభజన చట్టంలోని హామీలు, సెంట్రల్‌‌ స్పాన్సర్డ్‌‌ స్కీముల్లో రాష్ట్ర వాటా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం కోరిన నిధుల కేటాయింపుపై ఎంపీలకు సూచనలు చేయనున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యమకారిణి ధాత్రిక స్వప్న

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన రీసెర్చ్‌‌ స్కాలర్‌‌ ధాత్రిక స్వప్న తెలంగాణ భవన్‌‌లో కన్నీటి పర్యంతమ య్యారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో కేసీఆర్‌‌ నివాసం ఎదుట ఆమె ఆందోళన చేశారు. ఇటీవల హైదరాబాద్‌‌ లో ఆమెను పిలిచి కేసీఆర్‌‌ మాట్లాడారు. ఆమెను ప్రగతి భవన్‌‌కు తీసుకురావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డికి సూచించారు. కానీ ఎమ్మెల్సీ పట్టించుకోలేదు. ఈక్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్‌‌కు వచ్చిన స్పప్నను పోలీసులు బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా ఆమె వైపు ఫోకస్‌‌ చేయడంతో పల్లా ఆమెకు నచ్చజెప్పి అక్కడే ఉండమన్నారు. కేసీఆర్‌‌ వెళ్లిపోతుండగా ‘‘సార్‌‌.. మిమ్మల్ని కలువనీయట్లేదు..’ అని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌‌ ఆగమన్నట్టుగా చేయి చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తెలంగాణలో వ్యవసాయం బాగుపడింది. రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్నది. బీఆర్ఎస్‌‌కు అధికారం ఇస్తే రెండేండ్లలో దేశమంతటా 24 గంటల కరెంట్‌‌ ఇస్తం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తం. దేశంలోని రైతులకు కిసాన్ బంధు, ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తం. –సీఎం కేసీఆర్​