హార్టికల్చర్ సెంటర్లపై సర్కారు నిర్లక్ష్యం
రెండేళ్ల నుంచి మెయింటెనెన్స్ ఫండ్స్ ఇవ్వని ప్రభుత్వం
మొక్కలు పెంచట్లే..
రైతులకు శిక్షణ ఇవ్వట్లే
కామారెడ్డి, వెలుగు: ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు వివిధ జిల్లాల్లో ఏర్పాటుచేసిన హార్టీకల్చర్ సెంటర్లకు రెండేళ్లుగా ఫండ్స్ వస్తలేవు. దీంతో సరిపడా పండ్లు, కూరగాయల మొక్కలను పెంచలేక, రైతులకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వలేక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ రాష్ట్రంలో తోటల పెంపకంపై పడుతున్నది. మొక్కలు బయట అధిక ధరలకు కొనలేక, అవసరమైన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లేక రైతులు క్రమంగా హార్టీకల్చర్కు దూరమవుతున్నారు. ఉన్న పండ్ల తోటలనూ ధ్వంసం చేసి పత్తి, కంది, ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. దీంతో పండ్లకు, కూరగాయలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
తొమ్మిది చోట్ల హార్టీకల్చర్ సెంటర్లు
కామారెడ్డి జిల్లాలోని మాల్తుమ్మెద, కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, మంచిర్యాల జిల్లా కర్నాల్, భదాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, ఖమ్మంజిల్లా ఆశ్వారావుపేట, మహబూబ్నగర్లోని పిల్లల మర్రి, సిద్దిపేట జిల్లాలోని ములుగు, మెదక్ జిల్లా నత్నాయపల్లి, రంగారెడ్డి జిల్లాలోని జీడిమెట్లలో ఉద్యాన మొక్కల ఉత్పత్తి, అధునాతన శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ సెంటర్లలో వివిధ పండ్లు, కూరగాయల మొక్కలను పెంచాలి. మేలైన వంగడాలకు అంట్లు కట్టి రైతులకు తక్కువ ధరకు అందించాలి. ఆయా సెంటర్ల పరిధిలో రైతులకు అధునాతన పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, పూలు ఎలా సాగుచేయాలో తరచూ ట్రైనింగ్ ఇవ్వాలి. గతంలో ఏటా లక్షో, రెండు లక్షలో ఫండ్స్ కేటాయించినప్పటికీ 2019–-20,2020–-21లో పైసా కూడా సర్కారు ఇవ్వలేదు. దీంతో నర్సరీల్లో పండ్లు, కూరగాయల మొక్కల పెంపకాన్ని ఆఫీసర్లు ఆపేశారు. కొన్ని సెంటర్లలో తోటలను లీజ్కిస్తూ వచ్చిన ఫండ్స్తో లేబర్కు జీతాలు చెల్లిస్తున్నారు. కానీ ఏ సెంటర్ పరిధిలోనూ రైతులకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. కొన్ని జిల్లాల్లో ఇలాంటి సెంటర్లు ఉన్నాయనే విషయమే రైతులకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కామారెడ్డి జిల్లాలో ఇలా..
కామారెడ్డి జిల్లాలోని మాల్తుమ్మెద హార్టీకల్చర్ సెంటర్కు 2018-19 లో రూ.2 లక్షల ఫండ్స్ ఇచ్చారు. ఈ సెంటర్కు 60 ఎకరాల భూమి ఉంది . 20 ఎకరాల్లో మామిడి తోట, 2 ఎకరాల్లో జామ తోట, ఎకరంలో దానిమ్మ తోట సాగవుతోంది. హార్టీకల్చర్ ఆఫీసర్ కింద ఇద్దరు లేబర్ పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాక వీరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో రెండేళ్లుగా మొక్కల ఉత్పత్తి నిలిపేశారు. పండ్లతోటలను వేలం వేయడం ద్వారా వస్తున్న ఫండ్స్తో లేబర్కు జీతాలు ఇస్తున్నారు. ఆకుకూరల సాగు కోసం వేసిన షేడెట్ నెట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. నర్సరీలు, పండ్ల తోటల పెంపకం కోసం ఫండ్స్ కావాలని ఏటా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపుతున్నా పైసలు రావట్లేదని ఆఫీసర్లు అంటున్నారు.