చాబహార్ పోర్టుకు నిధుల్లేవు... బడ్జెట్లో కేటాయింపులు జరపని కేంద్రం

చాబహార్ పోర్టుకు నిధుల్లేవు... బడ్జెట్లో కేటాయింపులు జరపని కేంద్రం

న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్​లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టు ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్​లో సర్కారు ఎటువంటి నిధులను కేటాయించలేదు. ఇరాన్​లోని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం గత కొన్నేండ్లుగా భారత్ ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తూ వస్తున్నది. అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ఈ పోర్టు భారత్​కు అత్యంత కీలకం. 

చాబహార్ పోర్టు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారాన ఉన్నది. ఇది ఇరాన్​లో మొట్టమొదటి డీప్ వాటర్ పోర్టు. ఆ దేశానికి ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలకు నేరుగా ప్రవేశాన్ని కల్పిస్తున్నది. పాకిస్తాన్​లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా భారత్ చాబహార్ ను అభివృద్ధి చేస్తున్నది. 

ఈ పోర్టుతో పాకిస్తాన్ ను బైపాస్ చేసే అవకాశం ఇండియాకు లభిస్తున్నది. అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాకు వెళ్లేందుకు పాకిస్తాన్ తన భూమార్గం నుంచి ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా భారత్ చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తున్నది.