
- 10% చొప్పున ఇస్తామని గతంలో రాష్ట్ర సర్కార్ ప్రకటన
- 2 నెలలకు మాత్రమే చెల్లింపు.. ఆ తర్వాత నుంచి బంద్
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హెల్త్ స్టాఫ్
హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లకు సేవలు అందించే హెల్త్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నది. కష్టకాలంలో పనిచేస్తున్న హెల్త్ వారియర్స్ అందరికీ వేతనంలో పది శాతం చొప్పున ఇన్సెంటివ్ రూపంలో అందజేస్తామని చెప్పిన సర్కార్.. ఆ మాటను నిలుపుకోవడంలో ఫెయిలైంది. 2 నెలలు మాత్రమే ఇన్సెంటివ్స్ ఇచ్చి వదిలేసింది. ఆర్నెళ్లవుతున్నా ఇన్సెంటివ్ మాట ఎత్తడం లేదు. కరోనా వార్డుల్లో డ్యూటీ చేస్తున్న నర్సులకు రోజూ రూ. 300 చొప్పున అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇస్తామన్న ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా, జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని అంటున్నారు. శాలరీస్ కోసం వారం రోజులుగా నిమ్స్ నర్సులు ఆందోళన చేస్తున్నారు.
3 నెలలుగా రెసిడెంట్ డాక్టర్లకూ జీతాల్లేవ్
పీజీ పూర్తయిన సుమారు 11 వందల మంది డాక్టర్లను సీనియర్ రెసిడెంట్లుగా సర్కారు నియమించింది. వివిధ ప్రభుత్వ దవాఖాన్లలో వీరికి పోస్టింగులు ఇచ్చింది. ఏడాదిపాటు కంపల్సరీగా పనిచేయాలని, శాలరీ ఇస్తామని చెప్పింది. ఇది జరిగి 3 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ ఒక నెల శాలరీ కూడా చెల్లించలేదు. రెసిడెన్స్ డాక్టర్లకు చెల్లించాల్సిన శాలరీ డబ్బులను ఆర్థిక శాఖ విడుదల చేసిందని ఆరోగ్యశాఖ ఆఫీసర్లు అంటున్నారు. వివిధ కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయాయని, పది రోజుల్లో 3 నెలల శాలరీలు చెల్లిస్తామని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఇన్సెంటివ్ విషయంలో మాత్రం ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.