కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్కు వెళ్లిన అమిత్ షా.. ఓ నేషనల్ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగాల్తోపాటు బిహార్ గురించి పలు విషయాలు మాట్లాడారు. బిహార్లో తిరిగి ఎన్డీఏ అధికారంలో వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ అమలు కష్టసాధ్యమన్నారు.
‘దేశానికి హోంమంత్రిగా ఉంటూ బెంగాల్ హింసపై నేను స్పందించలేను. కానీ బీజేపీ లీడర్గా మాత్రం కామెంట్ చేస్తా. బెంగాల్లో బీజేపీ విస్తరణను తృణమూల్ పార్టీ అణచివేస్తోంది. మా పార్టీ నాయకులపై తృణమూల్ దాడులకు పాల్పడుతోంది. 100కు పైగా బీజేపీ కార్యకర్తలు చనిపోయినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అసమర్థత, వైఫల్యానికి దీన్ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. భారత్లోని ఓ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంతగా దిగజారడాన్ని నేనెప్పుడూ చూడలేదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.