అయినా మేం హోంగార్డులం.. ఐపీఎస్లే పార్టీని గెలిపించుకోవాలి: వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మునుగోడులో పాదయాత్ర, ప్రచారానికి తనను ఎవరూ పిలవలేదని, పిలవని పేరంటానికి ఎవరైనా వెళ్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు బై పోల్గురించి తనతో ఎవరూ ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్లోనే ఉన్నా తనను సంప్రదించలేదన్నారు. అయినా తాము హోం గార్డులమని, ఐపీఎస్లే పార్టీని గెలిపించుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన తన నివాసంలో ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. ‘‘చండూరులో నాకు తెలియకుండా సభ పెట్టించి చిన్న పిల్లలతో నన్ను తిట్టించిన్రు. హోంగార్డులు 30, 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా ఐపీఎస్ల మాట వినాల్సిందే. నేను, జానారెడ్డి లాంటి లీడర్లందరూ హోంగార్డులం, నిన్న మొన్న వచ్చినోళ్లంతా ఐపీఎస్లు అనుకుంటే వాళ్లే పార్టీని గెలిపించుకోవాలి. నాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఒక డ్రామా. తెలంగాణ కోసం మంత్రిపదవిని వదులుకొని, 16 రోజులు నిరాహార దీక్ష చేసి పార్టీ కోసం కష్టపడితే, ఎవరో పిల్లలు నన్నేదో అంటే అక్కడే వాళ్లను చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పాల్సింది. అసలు క్షమాపణ చెప్పాల్సింది రేవంతే. ఆయనే సభ పెట్టించిన్రు. కాబట్టి సారీ చెప్పాల్సింది కూడా రేవంతే. నేను ఢిల్లీలో ఉండగానే నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పార్టీలో ఎట్లా చేర్చుకుంటరు? నేను మల్కాజ్గిరి, కొడంగల్కు వెళ్లి చేర్చుకోలేనా? వెంకట్రెడ్డి అంటే తమాషాగా ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.
దాసోజు లాంటి మంచి లీడర్ను వదులుకోవడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. గతంలో తనను హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జునసాగర్ఎన్నికల ప్రచారానికి పిలిస్తే అక్కడే ఉండి డబ్బు ఖర్చుపెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని, మునుగోడులో మాత్రం ఎవరూ తనకు ఏ బాధ్యత కూడా అప్పజెప్పలేదని తెలిపారు. వాళ్లే కమిటీలు వేసుకుంటున్నారని, జానారెడ్డే ఆ పనులన్నీ చూసుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. అలాగే తాను పార్టీ మారేది లేదని రేవంత్కు ఢిల్లీలో స్పష్టం చేశానని, అయినా సీనియర్లను అవమానపరిచేలా మాట్లాడడం కరెక్ట్కాదని హితవు పలికారు. ఎవరేమన్నా తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్తోనే ఉంటానని స్పష్టం చేశారు. ఏ విషయమైనా సోనియా, రాహుల్ సమక్షంలో తేల్చుకుంటానని వెంకట్రెడ్డి చెప్పారు.