న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన రిపోర్ట్లు ఊహాజనితమని అన్నారు. ఆయన కామెంట్స్ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. హెచ్పీసీఎల్ షేర్లు 3 శాతానికి పైగా పెరగగా, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 2 శాతం వరకు ర్యాలీ చేశాయి. ‘పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరపడం లేదు.
ధరల పరంగా స్టేబుల్ వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం’ అని పురి అన్నారు. కాగా, కేంద్రం పెట్రోల్ ధరను లీటరకు రూ.4–6 తగ్గించాలని చూస్తోందని మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. ట్రక్ డ్రైవర్ల నిరసనలపై మాట్లాడుతూ.. పెట్రోల్ పంపుల దగ్గర హడావిడి నెలకొన్నా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలకడగానే పెట్రోల్, డీజిల్ను సప్లయ్ చేస్తున్నాయని చెప్పారు. వెనుజులాపై యూఎస్ ఆంక్షలు ఎత్తేయడంతో ఈ దేశం నుంచి ఆయిల్ కొనాలని చూస్తున్నామని చెప్పారు. ఆంక్షలు ఎదుర్కోని ఏ దేశం నుంచైనా ఆయిల్ను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.