
ఎగ్జిట్ పోల్స్ తర్వాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు చేసే అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనుగోలు చేయలేరని.. తమ నేతలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలంతా ఎంతో నమ్మకంతో ఉన్నామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉంటున్నట్లు తమకు సమాచారం వచ్చిందని డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు
మరో వైపు డిసెంబర్ 2న డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్ర ఎన్నికల ఫలితాల మానటరింగ్ బాధ్యతను శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. హంగ్ ఏర్పడితే అభ్యర్థులను బెంగళూరు క్యాంపుకి తరలించే ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా డీకే శివకుమార్ పర్యవేక్షణలో జరగనుంది.