గవర్నర్ గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా

గవర్నర్ గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ గురువారం ఉదయం రాజ్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’’ అని  అన్నారు. తాను రాష్ట్రానికి గవర్నర్ గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను, కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు.

‘‘తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి మోడీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా రాజ్ భవన్ స్కూలులో విద్యార్థుల కోసం భోజన ఏర్పాటు చేశాను. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని  పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాను’’ అని తమిళిసై వివరించారు. కాగా, అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేక్ ను గవర్నర్ కట్ చేశారు. 

మరిన్ని వార్తలు..

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజ్యసభకు ఇద్దరు టీఆర్ఎస్​ సభ్యులు ఏకగ్రీవం!