
బషీర్బాగ్, వెలుగు: సంచార జాతులు బాగా చదివి రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో తెలంగాణ సంచార విముక్త జాతుల దినోత్సవం బుధవారం (సెప్టెంబర్ 10) జరగగా మంత్రి గెస్ట్గా హాజరయ్యారు.
మంచి తరాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.400 కోట్లు ప్రకటించి, ఇప్పటికే రూ.వంద కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. కుల వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో సంచార జాతుల కుల వృత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు