- అథణి నుంచి లక్ష్మణ్ సావడి పోటీ
- హుబ్బళ్లి ధార్వాడ్ నుంచి హస్తం గుర్తుపై ఇయ్యాల షెట్టర్ నామినేషన్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మంగళవారం ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్కు గట్టిపోటీని ఇవ్వడమే లక్ష్యంగా ఆయన పోటీ చేసే కనకపుర స్థానం నుంచి రాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఆర్.అశోకను బీజేపీ రంగంలోకి దింపింది. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి అశోక నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, తన సిట్టింగ్ స్థానమైన పద్మనాభనగర్నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ‘‘ఎన్నికల వ్యూహరచనలో అమిత్షా చాణిక్యుడి లాంటివారు. ఆయనే నన్ను కనకపురకు పంపించారు. ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో బీజేపీ మీటింగ్ జరిగితే 50 మంది కూడా వచ్చే వాళ్లు కాదు. ఇప్పుడు వేలాది మంది మా వెంట ఉన్నారు. ఇదే మా బలం” అని అశోక వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్ కర్నాటక చీఫ్ డీకే శివకుమార్ సోమవారమే కనకపుర స్థానం నుంచి నామినేషన్ వేశారు. శివమొగ్గ జిల్లాలోని షికారీపుర సీటు నుంచి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సోమవారమే నామినేషన్ వేశారు.
హుబ్బళ్లి ధార్వాడ్ సెంట్రల్ నుంచి షెట్టర్..
బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన సిట్టింగ్ స్థానం హుబ్బళ్లి ధార్వాడ్ సెంట్రల్ నుంచే పోటీ చేస్తానని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ముధోల్ బిల్గి అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ అభ్యర్థులు గోవింద్ కర్జోల్, మురుగేశ్ నిరానీ నిర్వహించిన ర్యాలీలలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. మాజీ మంత్రి రమేశ్ జర్కిహోలీ గోకక్స్థానం నుంచి బీజేపీ టికెట్తో బరిలోకి దిగారు. ఇక జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చన్నపట్న స్థానం నుంచి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి రామనగర నుంచి బరిలోకి దిగారు.