
- వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలె
- నాలా కన్వర్షన్ కూడా ఫ్రీ
- త్వరలో మెరూన్ కలర్లో కొత్త పాస్ బుక్ల జారీ
- సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌస్లు వంటి నాన్ అగ్రికల్చర్ ఆస్తులన్నింటినీ ఉచితంగా మ్యుటేషన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని.. వెంటనే ఆన్లైన్లో ఎన్రోల్ చేయించుకోవాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారందరికీ త్వరలో మెరూన్ కలర్ లో పట్టాదారు పాస్ బుక్లను జారీ చేయనున్నట్టు వెల్లడించారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూవివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామన్నారు.
మ్యుటేషన్ చేయించుకోకుంటే ఇబ్బంది
ఇక ముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదికి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను.. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే.. భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘పేదలు ఎన్నో ఏండ్లుగా ఉంటున్న ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తం. దీనివల్ల పేదల స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్ఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇండ్లు ఎలా కట్టారన్నది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, రూల్స్కు లోబడి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులను ఫ్రీగా నాలా కన్వర్షన్ చేస్తం. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరీ నుంచి తొలగించే విషయంలో ప్రజలకు.. సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, స్టాఫ్ సహకరించాలి. ఎంపీవోలు దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
సాదాబైనామాలకు లాస్ట్ చాన్స్
గ్రామీణ ప్రాంతాల్లో భూముల సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేస్తామని, ఇదే చివరి అవకాశమని కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో సాదాబైనామాలను అనుమతించబోమని, ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివాదాలుంటే కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు.
అన్ని ఆస్తులు ఆన్లైన్ కావాలె..
భవిష్యత్లో ఆస్తుల నమోదు, రెగ్యులరైజేషన్, ఉచిత నాలా కన్వర్షన్ వంటివి ఉండవని, ఇదే చివరి చాన్స్ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇల్లు, ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు కావాలన్నారు. అలాంటి వాటన్నింటికీ ఇంటి నంబర్ కేటాయించాలని, ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ధరణి రెడీ కావడంలో కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదని.. పోర్టల్ ప్రారంభమయ్యాకే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్టేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల రెగ్యులరైజ్ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో గురువారం ప్రగతిభవన్ లో సీఎం సమావేశం కానున్నారు.
ఇక నుంచి ప్రతి జీవో, సర్క్యులర్ తెలుగులో కూడా..
ప్రభుత్వం విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్లు ఇంగ్లిష్ తోపాటు తెలుగులో కూడా ఉండాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమాచారం ఈజీగా ఉండేలా, ప్రజలకు సులభంగా అందేలాఅధికారులు వ్యవహరించాలని సూచించారు.