
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలతో పాటు రోగాలు ముసురుతున్నాయి. ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుండగా, వాతవరణ మార్పులతో డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్లతో జనం దవాఖాన్ల బాట పడుతున్నారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు, చెత్తచెదారం, ఇతర వ్యర్థాలు నీళ్లలో కలవడం, దోమలు, కంపు, కలుషిత వాతావరణంతో వేల మంది విష జ్వరాల బారినపడ్తున్నారు. సర్ది, దగ్గు, డయేరియా వంటివి చుట్టుముడ్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే 42,265 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 13 వేలకు పైగా డెంగీ సస్పెక్టెడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ లెక్కలు చెప్తున్నాయి. డెంగీ కేసులు పెరిగే ప్రమాదముందని ఆరోగ్యశాఖ ముందే హెచ్చరించినా, దోమల నివారణకు మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు పెద్దగా చర్యలు చేపట్టలేదు.
డిసీజ్ కంట్రోల్ కమిటీలు
వ్యాధుల కట్టడి, సత్వర చికిత్స కోసం గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకూ ‘డిసీజ్ కంట్రోల్కమిటీ’లు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో పర్యటించి, ఫీవర్ సర్వేలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ర్యాపిడ్ డయాగ్నస్టిక్టెస్టు(ఆర్డీఎస్) కిట్లను అందుబాటులో ఉంచుతారు. పీహెచ్సీ కేంద్రంగా ర్యాండమ్గా అందరికీ టెస్టులు చేయనున్నారు. వైరల్, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ప్లూ తదితర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక హై రిస్క్ఏరియాల్లో ఇండోర్రెసిడ్యూయల్ స్ప్రే చేయిస్తారు. ఈ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి దోమ తెర, మందులు ఇవ్వనున్నారు. స్థానికంగా ఉండే వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖలతో కలిసి యాంటీలార్వ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆశా వర్కార్లు, ఏఎన్ఎంలు కోఆర్డినేట్చేయనున్నారు. ఏ వ్యాధులు పాజిటివ్ తేలినా పీహెచ్సీలోనే పూర్తి వైద్యం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని టీమ్లకు సూచించినట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
పీహెచ్సీలలో డాక్టర్ల కొరత
రోగాలను ఆదిలోనే గుర్తించి చికిత్స అందించే బాధ్యతను పోషించాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్లు డాక్టర్లు లేక వెలవెలబోతున్నాయి. పీహెచ్సీలలో పనిచేస్తున్న సుమారు 250 మంది స్పెషలిస్టు డాక్టర్లను సర్దుబాటులో భాగంగా పెద్ద దవాఖాన్లకు బదిలీ చేయడం, ఇన్సర్వీస్ కోటా పీజీ సీట్లు వచ్చి సుమారు 130 మంది డాక్టర్లు వెళ్లిపోవడం, సుమారు ఏడొందలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండడంతో పీహెచ్సీలలో విపరీతంగా డాక్టర్ల కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు చాలా చోట్ల డాక్టర్లు లేక రోగులు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పులతో జనాలు త్వరగా వైరస్లు, బ్యాక్టీరియాల బారిన పడే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, డయాబెటిస్, టీబీ, ఎయిడ్స్ పేషెంట్లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. వెదర్ ఫ్లక్చువేషన్ అవుతున్నకొద్దీ వైరస్ రూపు మార్చుకుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్, వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలి.
- డాక్టర్ బాబురావు, ప్రొఫెసర్, ప్రివెంటివ్ మెడిసిన్