రామాయంపేట, వెలుగు: రామాయంపేట బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు అధికారులు గురువారం నోటీసులు అందజేశారు. పట్టణం మీదుగా నిర్మించనున్న నేషనల్ హైవే 765 డీ.జీ.లో సుమారు 40 మంది రైతులు 33 ఎకరాలు కోల్పోతుండగా రూ.19 కోట్ల పరిహారం అందజేయనున్నారు. ఈ మేరకు భూ నిర్వాసిత రైతులకు తహసీల్దార్ నోటీసులు అందజేశారు. భూములు కోల్పోయే తమకు ప్రభుత్వం అందించే పరిహారం చాలట్లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో ప్రభుత్వ ధర కంటే మూడింతలు ఎక్కువ చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కేవలం ఎకరానికి తొమ్మిదిన్నర లక్షలు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఎకరం రూ.రెండు కోట్ల ధర పలుకుతుందని వారు ఇచ్చే ధర చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
