
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్లో సమర్పించవచ్చు.
ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు రిజల్ట్ ప్రకటించనున్నారు.
డిజిటల్ నామినేషన్..
ఎన్నికల సంఘం ఎన్ కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్లైన్లో సమర్పించవచ్చు. అయితే, క్యూఆర్ కోడ్తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి.
ఆన్లైన్ డిపాజిట్ బ్యాంక్/ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండకపోతే మాన్యువల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు రిటర్నింగ్ ఆఫీసర్ను సంప్రదించాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
జూబ్లీహిల్స్ బై పోల్ అబ్జర్వర్గా సంజీవ్ కుమార్ లాల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బై పోల్ వ్యయ పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం 2014వ బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ను ఆదివారం నియమించింది. ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించడంతో పాటు అన్ని కార్యకలాపాలను ఆయన సమీక్షించనున్నారు. డబ్బు ప్రలోభాలు, అభ్యర్థుల ఖర్చులపై సంజీవ్ కుమార్ లాల్ దృష్టి పెట్టనున్నారు.