ఎటువంటి సమస్యలు ఎదురైనా.. ధైర్యంగా నిలబడితే సక్సెస్ మన సొంతమవుతుంది. ఆ సక్సెస్లోనే మనకో లైఫ్ దొరుకుతుంది అంటోంది నౌజిషా ఎ. కేరళ సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో రెండో ర్యాంకర్ ఈమె. ఈ మాటలు ఆమె జీవితం నుంచి చెప్పినవే...
కేరళలోని కోజికోడ్లో ఉంటుంది 33 ఏండ్ల నౌజిషా. చిన్నప్పటి నుంచి చదువు, ఆటపాటల్లో టాప్గా వచ్చేది. కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ పూర్తిచేసింది. మంచి జాబ్ చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కనేది. అంతలోనే మంచి సంబంధం అని చెప్పి పెండ్లి చేశారు తల్లిదండ్రులు. పెండ్లయ్యాక ‘నీకు ఇష్టం ఉంటే జాబ్ చేసుకోవచ్చు’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు భర్త.
కొడుకుకోసం తిరిగొచ్చింది
కొడుకు పుట్టాక.. భర్త, కొడుకే సర్వస్వమని, తను కన్న కలల్ని కుటుంబ బాధ్యత కోసం వదులుకుంది నౌజిషా. కానీ, భర్త వేధింపులు మొదలయ్యాయి. పిల్లాడిని పట్టించుకునేవాడు కాదు. రోజూ తాగొచ్చి గొడవచేసేవాడు. కొట్టేవాడు. భర్తకు నచ్చచెప్పాల్సిన అత్తామామలు కూడా అతన్నే సపోర్ట్ చేశారు. పోలీస్ కేస్ పెట్టాలనుకుంది. కానీ, దానివల్ల తనకు న్యాయం జరగదు, వాళ్లు భర్తకే సపోర్ట్ చేస్తారు అనుకుంది. అవన్నీ భరించలేక ఒకరోజు చనిపోదామని బావి దగ్గరకు వెళ్లింది. అప్పుడే ‘పిరికి దానిలా చనిపోతే జీవితానికి అర్థం ఏముంది. దానివల్ల కొడుకు జీవితం నాశనం అవుతుంది. భర్త సపోర్ట్ లేకపోతే బతకలేనా?’ అని తనకు తాను నచ్చచెప్పుకుంది.
ఇంట్లో నుంచి వచ్చేసి...
ఆ ధైర్యంతోనే కొడుకును తీసుకొని ఇంట్లోనుంచి బయటికి వచ్చేసి, కాలేజీలో లెక్చరర్గా చేరింది నౌజిషా. కొన్ని రోజులకు కేరళ పిఎస్సి (పబ్లిక్ సర్వీస్ కమిషన్) పోస్ట్లు నోటిఫై చేసింది. ఆ జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలి అనుకుంది. అందుకోసం వేరే ఏ పని పెట్టుకోకుండా, బాగా కష్టపడి చదవాలి. కొడుకు బాధ్యత ఆమెను వెనక్కిలాగింది. ఆ విషయం తెలిసిన నౌజిషా అక్క నౌఫా ‘నీ కొడుకును నేను పెంచుతా. నువ్వేం ఆలోచించకుండా చదువుకో’ అని చెప్పింది. అంతే... ఆ ప్రోత్సాహంతో, పట్టుదలతో కష్టపడి చదివింది. 2021 పిఎప్సి ఎగ్జామ్స్ రాసి, సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకుంది. ‘అమ్మాయిలకి బలం పెండ్లి అనుకుంటారు చాలామంది. కానీ కాదు. ఉద్యోగమే ఆడవాళ్ల బలం. ధైర్యం. ఆడవాళ్లకి కొన్నిసార్లు సపోర్ట్ దొరకొచ్చు... దొరక్కపోవచ్చు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మౌనంగా బాధపడొద్దు. భరించొద్దు. కష్టాలను ఎదుర్కొని, కలలను నెరవేర్చుకోవాలి.’
