న్యూఢిల్లీ: ఇప్పుడు స్టాక్ మార్కెట్ల పరిస్థితులు ఏమీ బాగాలేవు. గడచిన నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.15 లక్షల కోట్లు కోల్పోయారు. శుక్రవారం ఒక్క రోజే రూ.ఎనిమిది లక్షల కోట్లు నష్టపోయారు. యూఎస్లో ఆర్థిక పరిస్థితులు, చైనాలో కరోనా కేసుల విజృంభణ కారణంగా ఇక ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఫైనాన్షియల్ ఎనలిస్టులు అంటున్నారు.
ఇటువంటి సమయంలో కొత్త ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. ఈ దశలో ఏ రకం ఇన్వెస్ట్మెంట్ ఎంచుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఆటుపోట్ల వల్ల లాంగ్టర్మ్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్వెస్టర్లకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొత్త ఇన్వెస్టర్లే ఇప్పుడు ఆచితూచి ఆడుగేయాలి. ఇలాంటి వాళ్లు హైబ్రిడ్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ పండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదన్నది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్టులు చెబుతున్న మాట.
హైబ్రిడ్ ఫండ్స్లో రిటర్నులు రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మొత్తం డబ్బును వీటిలోనే పెట్టకూడదు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ తప్పనిసరి. కొంత డబ్బును హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు. మొత్తం డబ్బును ఒక్కటే ఫండ్లో కాకుండా వేర్వేరు దాంట్లో 6–12 భాగాలుగా విభజించి పెట్టాలి. లేదా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. పడుతున్న మార్కెట్లో కొత్త పెట్టుబడిదారులకు హైబ్రిడ్ ఫండ్స్ ఎలా మేలు చేస్తాయనే విషయం గురించి 360 వన్ వెల్త్ సీఎఫ్ఏ ప్రొడక్ట్ మేనేజర్ సాహిల్ కపూర్ ఇలా అన్నారు.
"పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆస్తుల కేటాయింపు పద్ధతిని ఎంచుకోవాలి. మార్కెట్ల వాల్యుయేషన్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైతే చిన్నచిన్న మార్పులు చేసుకోవచ్చు. హైబ్రిడ్ ఫండ్లు.. వాల్యుయేషన్, మూమెంటం వంటివి ఉపయోగించి పెట్టుబడులకు అనువైన సమయాన్ని ఎంచుకుంటాయి " అని వివరించారు.