- కేసీఆర్ది ఫెయిల్యూర్ సర్కార్: కన్హయ్య కుమార్
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగి ప్రవళికది ఆత్మహత్య కాదని, సర్కార్ హత్యేనని ఎన్ఎస్యూఐ నేషనల్ ఇన్చార్జి కన్హయ్య కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో పేపర్లను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నదని పైర్ అయ్యారు. హామీలు నెరవేర్చలేని వాళ్లే పేర్లు మార్చుకుంటారని, అలాగే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తెలంగాణ ఎలక్షన్ క్వశ్చన్ పేపర్ పేరిట ప్రశ్నలను రిలీజ్ చేశారు.
ఎన్నికల ఫలితాలొచ్చే రోజే ఈ పేపర్ ఆన్సర్లను రిలీజ్ చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది కీలక పోరాటమన్నారు. ఓయూ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిందని గుర్తు చేశారు. పదేండ్లలో ఉద్యోగాల కల్పన సక్రమంగా జరగలేదన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ అని అంటున్నారని, మరి లక్షలాది ఉద్యోగాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. అన్ని హామీలనూ కేసీఆర్ సర్కార్ తుంగలోకి తొక్కిందన్నారు.
మేనిఫెస్టోలో పెట్టినట్టు ఫిబ్రవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ను రిలీజ్చేస్తామన్నారు. ఏడాదిలో 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. కేజీ టు పీజీ అని హామీ ఇచ్చిన కేసీఆర్.. విద్యను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. ప్రజలకు విద్య, ఉద్యోగాలు కావాలని, అది వారి హక్కు అని అన్నారు. కార్పొరేట్ల రుణాలు మాఫీ అవుతున్నప్పుడు రైతుల రుణాలు మాత్రం ఎందుకు మాఫీ కావని ఆయన ప్రశ్నించారు.