సీనియార్టీ జాబితాను సవరించాలి: నర్సుల ధర్నా

సీనియార్టీ జాబితాను సవరించాలి: నర్సుల ధర్నా
  • కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు నర్సుల ధర్నా
  • డైరెక్టర్ రిలీజ్ చేసిన లిస్టులో తప్పులున్నయ్
  • లిస్టులో 36 మంది పేర్లు  లేవంటూ ఫైర్

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల బదిలీలు సరిగ్గా జరగడం లేవంటూ వందలాది మంది నర్సులు నిరసనకు దిగారు. శుక్రవారం సాయంత్రం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు బైఠాయించి తప్పులు సవరించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ప్రకటించిన సీనియార్టీ జాబితాలో తప్పులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సులు రోడ్డెక్కడంతో కోఠిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

రాత్రి 9 గంటల వరకు రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో రోడ్డు పై నుంచి కాలేజీ లోపల వెళ్లి బైఠాయించి ధర్నా కొనసాగించారు. కాగా, స్టాఫ్ నర్సుల బదిలీల కోసం ఉస్మానియా మెడికల్ కాలేజీలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వందలాది మంది నర్సులు కౌన్సిలింగ్ కోసం వచ్చారు. శుక్రవారం ఉదయం కౌన్సిలింగ్ ఉండగా.. గురువారం రాత్రి సీనియార్టీ లిస్ట్​ను అధికారులు విడుదల చేశారు. 

లిస్టులో తప్పులు ఉన్నాయని, వాటిని సవరించాలంటూ మధ్యాహ్నం ధర్నాకు దిగారు. తప్పులు సవరించి మధ్యాహ్నం కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు.. సాయంత్రం వరకు కూడా కౌన్సిలింగ్ ప్రారంభించలేదు. చివరికి కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరో రోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి నర్సులు ఒప్పుకోలేదు. సీనియార్టీ లిస్ట్ ప్రకటించి.. కౌన్సిలింగ్ జరపాల్సిందే అంటూ పట్టుబట్టారు. అర్ధరాత్రి వరకు అక్కడే ధర్నా కొనసాగించారు. 

లిస్టులో నుంచి పేర్లు మిస్!

ఒకే చోట నాలుగేండ్లకు మించి పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ నుంచి తప్పించుకునేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. యూనియన్ లీడర్ల పేరిట కొంత మంది మినహాయింపు పొందుతుండగా, మరికొంత మంది తమ పలుకుబడితో లిస్ట్ నుంచి పేర్లను తీసేయించుకుంటున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో దశాబ్దాల నుంచి పాతుకుపోయిన సుమారు 36 మంది స్టాఫ్ నర్సుల పేర్లు సీనియార్టీ జాబితా నుంచి తప్పించారని నర్సింగ్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. 

ఇందులో ఎక్కువగా సరోజిని దేవి కంటి దవాఖాన, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, కోఠి ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, చెస్ట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, ఉస్మానియా, గాంధీ దవాఖాన్లలో పనిచేస్తున్న వాళ్లే కావడం గమనార్హం.