పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం దాతల సహకారంతో భక్తుల కోసం నిర్మించే 22 వసతి గదులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రూ.1.30 కోట్లతో రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులను చేపట్టినట్టు చెప్పారు. రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పర్యాటక శాఖ నుంచి మరో రూ.8 కోట్లు సమకూర్చనున్నట్టు చెప్పారు. లీడర్లు చీకట్ల మొండయ్య, ప్రేమ్ సాగర్ రెడ్డి, నారాయణరెడ్డి, స్థపతి వల్లి నాయకం, ఈవో సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
