
- ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఆస్పత్రిలో ఘటన
భువనేశ్వర్: రోగులకు ఓ నర్సు రాంగ్ ఇంజక్షన్ ఇవ్వడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలోని షహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది. వివిధ కారణాలతో హాస్పిటల్లో చేరిన ఐదుగురు పేషెంట్లకు ఇటీవల సర్జరీ చేశారు. వారిని ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో నైట్ డ్యూటీలో ఉన్న ఓ నర్సు ఆ పేషెంట్లకు ఓ తప్పుడు ఇంజక్షన్ ఇచ్చింది. దీంతో ఐదుగురు పేషెంట్లు కొన్ని నిమిషాల వ్యవధిలో మరణించారు.
ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపడంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, ఇంజక్షన్ వాళ్ల వారు చనిపోలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఒక పేషెంట్ సర్వైకల్ క్యాన్సర్తో, మరో ముగ్గురు రోగులు తీవ్ర కత్తిపోట్లకు గురై, ఇంకో వ్యక్తి లివర్ ప్రాబ్లమ్తో, మరో పేషెంట్ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల చనిపోయారని తెలిపారు.
అయితే, నైట్ డ్యూటీలో ఉన్న నర్సు తన కళ్ల ముందే పేషెంట్లకు ఓ ఇంజక్షన్ ఇచ్చిందని, ఆమె ఇంజక్షన్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత ముగ్గురు రోగులు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై మెడికల్ కాలేజీ అంతర్గత విచారణకు ఆదేశించింది. రోగులకు ప్రొటోకాల్ ప్రకారమే ఇంజక్షన్ ఇచ్చారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పడిపోతున్న బ్లడ్ ప్రెషర్ స్థాయిలను సరిచేయడానికి సాధారణంగానే ఇంజక్షన్ ఇస్తారని తెలిపాయి.