
- ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఘటన
భువనేశ్వర్: భార్య డెలివరైన మరుసటి రోజే భర్త బార్డర్ కు వెళ్లారు. అనంతరం డెలివరీ అనంతర సమస్యలకు చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో జరిగింది. ఝార్సుగూడ జిల్లాలోని లఖన్ పూర్ బ్లాక్ టెంగ్నామల్ గ్రామానికి చెందిన దేబ్రాజ్ గండ్ సశస్త్ర సీమా బల్ లో జవాన్ గా వర్క్ చేస్తున్నారు. భార్య లిపి గండ్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో జవాన్ సెలవు తీసుకుని వచ్చారు. ఆమె ఏప్రిల్ 28న పండంటి పాపకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పాప పుట్టిన మరుసటి రోజే జవాన్కు ఫోన్ కాల్ రావడంతో విధుల నిమిత్తం బార్డర్ కు వెళ్లారు. గత 15 రోజులుగా అపస్మారక స్థితిలో ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె చనిపోయింది. లిపి గండ్ కు మెరుగైన చికిత్సను అందించడానికి ఎయిర్ అంబులెన్స్లో భువనేశ్వర్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఆమె చనిపోయిందని ఒడిశా రెవెన్యూ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు. దేబ్రాజ్ గండ్ కు సమాచారం అందించామని ఆయన ఒడిశాకు తిరిగి వస్తున్నారని చెప్పారు. జవాన్కు టుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.