- నిపుణుల సూచనల పేరకు 36 ప్రతిపాదనలు
నిర్మల్జిల్లాలోని కడెం ప్రాజెక్టు రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల వరదలతో ప్రాజెక్ట్భారీగా దెబ్బ తిన్నది. దీంతో ప్రాజెక్ట్ సేఫ్టీ పై అధికారులు దృష్టి పెట్టారు. జాతీయ సంస్థలకు చెందిన ఎక్స్పర్ట్స్ ప్రాజెక్ట్ను సందర్శించి తిరిగి వరదలొచ్చినా ప్రాజెక్ట్కు గానీ, దిగువ ప్రాంతాల ప్రజలకు గానీ ఎలాటి నష్టం కలుగకుండా ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్లాన్ రెడీ చేశారు.
నిర్మల్,వెలుగు: ఇటీవల వరదలతో భారీగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును పూర్తిగా ఆధునీకరించడంతో పాటు మళ్లీ వరదలొస్తే ప్రమాదం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై సెంట్రల్ డిజైన్ఆర్గనైజేషన్నిపుణులు పలు ప్రతిపాదనలు చేశారు. వీటిని ప్రభుత్వం ఆమోదించి, నిధులు కేటాయిస్తే వరద ముప్పు శాశ్వతంగా తొలగిపోనుంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తో పాటు డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆఫీసర్లు కడెం ప్రాజెక్టును ఇటీవల సందర్శించారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి పలు సిఫార్సులు చేశారు. కడెం ప్రాజెక్టు ను సపోర్టు ఫర్ ఇరిగేషన్ మాడ్రనైజేషన్ ప్రోగ్రామ్ ( సింప్) పరిధిలోకి చేర్చి రూ. 225 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. డీఆర్ఐపీ స్కీమ్కింద రూ. 16.6కోట్లతో కూడా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కొత్తగా 5 గేట్లు
వరద ప్రమాదాన్ని నివారించేందుకు సెంట్రల్ డిజైన్ఆర్గనైజేషన్ ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు అధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా 5 వరద గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కడెం ప్రాజెక్టు 18 గేట్ల ద్వారా వరద నీటిని కిందికి వదులుతుంటారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఈ గేట్ల ద్వారా ఇన్ఫ్లోకు తగ్గట్టుగా నీటిని బయటకు పంపడం సమస్యగా మారుతోంది. ఇందులో 9 జర్మనీ గేట్లు ప్రతిసారీ సతాయిస్తుండడంతో వాటిని తొలగించి ఇండియన్ గేట్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా మరో 5 గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో మొత్తం 23 గేట్ల ద్వారా వరదనీటిని వేగంగా దిగువకు వదలడం సాధ్యమవుతుందని అంటున్నారు. ప్రాజెక్ట స్పిల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు ప్లాన్ చేశారు. దీనివల్ల వరద నీరు దిగువకు వదిలే సమయంలో ఇబ్బంది ఉండదని చెప్తున్నారు.
‘సింప్’ కింద కడెం ఎంపిక
సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సపోర్ట్ ఫర్ ఇరిగేషన్ మాడ్రనైజేషన్ ప్రోగ్రామ్(సింప్) కింద కడెం ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ స్కీమ్కు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాకారం అందిస్తోంది. సింప్ కింద కడెంతో పాటు జూరాల, ఎస్సారెస్పీలను కూడా సీడబ్ల్యూసీ పరిశీలించింది. ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న రిపోర్ట్ల ఆధారంగా కడెంను ఎంపిక చేసింది. ఆఫీసర్లు రెడీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే రూ. 225 కోట్లు మంజూరవుతాయి. మెయిన్ కెనాల్ను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడంవల్ల వరద నీరు వేగంగా కిందికి వెళ్తుంది. దీంతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, కాలువల లైనింగ్ పనులు కూడా చేపట్టనున్నారు.
ప్రతిపాదనలు పూర్తి చేశాం
కడెం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రెడీ చేశాం. సింప్ కింద 36 పనులకు రూ. 225 కోట్లతో ప్లాన్ రెడీ చేసి.. పంపాం. ఇప్పటికే గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. ఇటీవల ఇంజనీర్ ఇన్ చీఫ్, సెంట్రల్ డిజైన్ఆర్గనైజేషన్, స్టేట్ డ్యాం సేఫ్టీ ఆఫీసర్లు ప్రాజెక్టును సందర్శించి ఆధునికీకరణకు సంబంధించి సూచనలు చేశారు.
- సుశీల్ కుమార్, ఎస్ఈ, ఇరిగేషన్
