రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఓపెన్ సేల్

రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఓపెన్ సేల్

 

  • బిల్డర్లు, అసోసియేషన్లకుటవర్లు అమ్మకం
  • ప్రచారం చేస్తున్న అధికారులు
  • అమ్మకానికి 795 ప్లాట్లు, టవర్లు
  • ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు

హైదరాబాద్, వెలుగు : రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్లను కొనేందుకు ప్రజలకు అధికారులు చాన్స్​ ఇచ్చారు. ఓపెన్ సేల్ విధానంలో పబ్లిక్​కు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉంచారు. గత నెల రోజుల నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ టవర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఫ్లాట్లు తీసుకోవాలని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను హౌసింగ్ అధికారులు కోరారు. ఈ మేరకు సీఎస్ ఆదేశాలతో అన్ని శాఖలకు లేఖలు రాశారు. ఆరు సార్లు వేలం నిర్వహించినా ఈ ఫ్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. దాంతో వాటిని కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులు అవకాశం ఇచ్చారు.

నెల రోజులుగా అమ్మకాలు

బండ్లగూడ, పోచారంలో సింగిల్, డబుల్ బెడ్రూ మ్ కలిపి సుమారు 795 ఫ్లాట్లు ఉన్నాయి. బండ్లగూడలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్182 ఉండగా, పోచారంలో సింగిల్ 256, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 357 ఉన్నాయి. బండ్ల గూడలో 1 బీహెచ్​కే రూ.15 లక్షలు, పోచారంలో సింగిల్ రూ.13 లక్షలు, 2బీహెచ్​కే రూ.19 లక్షలుగా నిర్ణయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాలకు వచ్చి పబ్లిక్ ఫ్లాట్ చూసుకొని టోకెన్ అమౌం ట్ కట్టాలని, తర్వాత 2నెలల్లో ఫ్లాట్ వాల్యూ అమౌంట్ మొత్తాన్ని కట్టాలని చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పబ్లిక్ నెల రోజుల్లో 50 ఫ్లాట్లు కొన్నారని రాజీవ్ స్వగృహ అధికారులు చెప్తున్నారు.

అమ్ముడవుతున్న టవర్లు

పోచారం, గాజుల రామారం, జవహార్ నగర్ లో రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లను హౌసింగ్ అధికారులు టవర్ల వారీగా వేలానికి పెట్టారు. వీటిని గుంపగుత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్లకు, బిల్డర్లకు అమ్మనున్నారు. నిర్మాణం పూర్తి అయినవి, సగం పూర్తయిన టవర్లను అమ్మకానికి ఉంచారు. వీటికి కొంత అమౌంట్ ఖర్చు చేసి రెనోవేషన్ చేస్తే కొత్త ప్లాట్స్ గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గాజుల రామారంలో 2 టవర్లను ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ తీసుకోగా, మరో 3 టవర్లను తీసుకునేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారని హౌసింగ్ అధికారి చెప్పారు. ఇక జవహార్ నగర్ లో 17 టవర్లలో మొత్తం 2800 ఫ్లాట్లు వేలానికి ఉంచగా, అక్కడ డంపింగ్ యార్డ్ వల్ల పోల్యూషన్, పొగ, దుర్వాసన ఉంటుందని కొనేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని అధికారులు చెబుతున్నారు.  పోచారంలో మరో నాలుగు టవర్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి.

వేలానికి మంచి రెస్పాన్స్    

ఈ ఏడాది జూన్ లో బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్లను వేలం వేశారు. ఇందులో ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన వారికి ఫ్లాట్ ఇస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బండ్లగూడలో 34 త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లకు ఏకంగా 364 మంది బిడ్ దాఖలు చేశారు. ప్రభుత్వం 3 బీహెచ్ కే ఫ్లాట్ చదరపు అడుగు(ఎస్ఎఫ్ టీ)కి రూ.3 వేలు ఖరారు చేయగా.. అత్యధికంగా రూ.4400 పలకింది. అత్యల్పంగా రూ.3900 పలికింది. ఇలా 34 ఫ్లాట్లను వేలం వేయగా అన్ని అమ్ముడయ్యాయి. 

బండ్ల గూడ 

 182 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ – 545 ఎస్ ఎఫ్ టీ – రూ.15లక్షలు ( ఒక్క ఎస్ ఎఫ్ టీ రూ.2750)
పోచారం 

 357 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ – 761 ఎస్ ఎఫ్ టీ – రూ.19లక్షలు ( ఒక్క ఎస్ ఎఫ్ టీ రూ.2500)
 256 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ – 523 ఎస్ ఎఫ్ టీ – రూ.13.10లక్షలు ( ఒక్క ఎస్ ఎఫ్ టీ 2500 )

పోచారంలో టవర్లు

 7 టవర్లు, అన్ని టవర్లు కలిపి 496 త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, ఒక్కో ఫ్లాట్ 1125 ఎస్ ఎఫ్ టీ నుంచి  1470 వరకు ఉన్నాయి. 22 ఫ్లాట్లు ఉన్న టవర్ రూ.5.82 కోట్లు, 18 ఫ్లాట్లు ఉన్న

టవర్ – రూ.9.50 కోట్లు.

 త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్లు – రూ. 24.30లక్షలు 1470 ఎస్ ఎఫ్ టీ ( ఒక్క ఎస్ ఎఫ్ టీ రూ.1650 )
 త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.15.19లక్షలు – 1125 ఎస్ ఎఫ్ టీ ( ఒక్క ఎస్ ఎఫ్ టీ రూ.1350 ) 

గాజుల రామారం 

 72 ఫ్లాట్లు ఉన్నటవర్, 12 ఫ్లాట్లు ఉన్న టవర్ రూ. 45.50 కోట్లు (డబుల్ బెడ్ రూమ్ . 813 ఎస్ ఎఫ్ టీ ఫ్లాట్)