ఓల్డ్ సిటీ మెట్రో అలైన్ మెంట్....ఇవే స్టేషన్లు

ఓల్డ్ సిటీ మెట్రో అలైన్ మెంట్....ఇవే స్టేషన్లు

 పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది.  ఓల్డ్ సిటీలో 5.5కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్‌మెంట్ ఎంజీబీఎస్ నుండి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఇత్తెబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో  సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉండనున్నాయి. మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఈ రెండు స్టేషన్‌లకు హైదరాబాద్ లో  ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని హెచ్ఎంఆర్ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు & 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన,ఇతర సున్నితమైన నిర్మాణాలు ఈ మెట్రో రైల్ మార్గంలో ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్‌లలో తగిన మార్పు మొదలైన ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, నాలుగు తప్ప మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు పరిరక్షించబడ్డాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్‌కు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయి. 

ఓల్డ్ సిటీలో మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుంది. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరిస్తారు. ఈ విస్తరణలో ఎఫెక్ట్ అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించబడిందని..  నెలరోజల్లో  భూ సేకరణ నోటీసులు జారీ చేయబడతాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.