ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆయన చదువుకున్న విభాగంలో ప్రతిపాదిత క్లాస్ రూం కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ విరాళాన్ని అందజేశారు. 106 సంవత్సరాల ఓయూ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక విరాళం అందజేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ టీకే కృష్ణ దంపతులను ఇంజినీరింగ్ కాలేజీ అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
గోపాల్ టీకే కృష్ణ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1968లో బీఈ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడి రాజకీయంగా కూడా ఎదిగారు. అక్కడి రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఓయూలో నిర్మించబోయే బిల్డింగులో ఆడిటోరియానికి ప్రొఫెసర్ వీఎం గాడ్గిల్ పేరు, కమిటీ హాలుకు ప్రొఫెసర్ ఆబిద్ అలీ పేరు, ల్యాబ్లకు అక్కడి సిబ్బంది పేర్లు పెట్టాలని సూచించారు. రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈ భవన నిర్మాణానికి రూ.9.95 కోట్లు అంచనా వేసింది.