న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆఖరు క్షణాలలో ఉన్న తల్లికి ఫోన్లో పాట పాడి వినిపించాడో కొడుకు.. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ తల్లికి గుడ్ బై చెప్పి చివర్లో భోరుమన్నాడు. ఆ తల్లీ కొడుకుల చివరి ఫోన్కాల్ ఆస్పత్రి సిబ్బందిని కంటతడి పెట్టించింది. ఆ ఫోన్ కాల్ చేసిన డాక్టర్ ఈ సంఘటనను వివరిస్తూ చేసిన ట్వీట్చదివిన వాళ్లంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఈ విషాదం చోటుచేసుకుంది. సిటీకి చెందిన డాక్టర్ దీప్షికా ఘోష్ కరోనా వార్డ్లో డ్యూటీ చేస్తున్నారు. ఈ నెల 12న సంఘమిత్ర చటర్జీ అనే పేషెంట్ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక బతికే అవకాశంలేదని అర్థంకావడంతో డాక్టర్ దీప్షిక పేషెంట్ను పలకరించారు. ఒకసారి తన కొడుకు సోహమ్ చటర్జీని చూడాలని కోరడంతో.. దీప్షిక తన ఫోన్ నుంచి ఆయనకు వీడియో కాల్ చేశారు. కొడుకును కళ్లారా చూసుకుంది. తల్లి పరిస్థితి చూసి సోహమ్ తట్టుకోలేకపోయాడు. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను, కన్నీటిని దిగమింగి తల్లికోసం ఓ పాట పాడాడు. స్వతహాగా సింగర్ కావడంతో తల్లికి పాటపాడుతూ తుది వీడ్కోలు పలికాడు. పాట మధ్యలో కన్నీరు ఆపుకోలేక భోరుమన్నాడు. తర్వాత తేరుకొని పాట పూర్తిచేశాడు. సోహమ్ పాట తననే కాదు.. వార్డులోని ఇతర డాక్టర్లు, నర్సులను కంటతడి పెట్టించిందని, అందరూ సంఘమిత్ర బెడ్ దగ్గరికి చేరి సైలెన్స్గా నిలుచున్నారని డాక్టర్ దీప్షిక చెప్పారు.
