
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సరఫరాలో నష్టాల పేరుతో ప్రైవేటీకరణ ప్రతిపాదన సరికాదని, ఈ నిర్ణయం విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. బుధవారం జేఏసీ ప్రతినిధి బృందం సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీని కలిసి వినతిపత్రం అందించారు. ఓల్డ్ సిటీలో కరెంట్ సరఫరా, బిల్లుల వసూళ్ల బాధ్యత ప్రైవేట్ కంపెనీ అదానీ గ్రూప్నకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందని వస్తున్న మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
హైదరాబాద్ సౌత్ సర్కిల్లో కరెంట్ సరఫరా, బిల్లుల వసూళ్ల బాధ్యత అదానీ కానీ మరే ఇతర ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదనను విరమించుకునేలా సర్కార్ను ఒప్పించాలని అభ్యర్థించారు. ప్రైవేట్ కంపెనీలు లాభాపేక్షతో వినియోగదారులపై అదనపు భారాన్ని మోపేలా విద్యుత్ వ్యవస్థను నడుపుతాయన్నారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్లో అధిక నష్టాలను ప్రభుత్వ మద్దతుతో సదరన్ డిస్కం తగ్గించొచ్చని తెలిపారు. సౌత్ సర్కిల్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా ఇంజనీర్లు, ఉద్యోగులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.